Friday, January 1, 2010

గ్రహణం రోజున దేవాలయాలు ఎందుకు మూసివేస్తారు?

ఈ శతాబ్దంలోనే అద్బుతమనదగిన సంపూర్ణ సూర్య గ్రహణం ఈ రోజు (జూలై 22-2009)చోటు చేసుకుంది. ఈ గ్రహణం సామాన్య ప్రజల నుండి, శాస్త్రవేత్తల వరకు అందరి లోనూ అలజడి కలిగించింది. శాస్త్రవేత్తలు తమకు ఎంతో కాలం తరువాత చేతి నిండా పని దొరికింది, సూర్యుడి గురించి మరిన్ని కొత్త విషయాలు పరిశోధన చేయవచ్చని అనుకుంటే, సామాన్య ప్రజలు తమ తమ విశ్వాసాలననుసరించి తగు జాగ్రత్తలు పడ్డారు.

గ్రహణం వల్ల మనిషిపై ఎటువంటి ప్రభావం లేదని అంటున్నారు. అది నిజమే అయితే గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడిని డైరెక్ట్‌గా చూడవద్దని చెబుతున్నారు? కంటిలో వుండే సున్నితమయిన పొరలు దెబ్బతిని అంధత్వం వస్తుందనే కదా. అంటే ఆ సమయంలో ఏర్పడిన కిరణాల రేడియేషన్ ప్రభవం మన మీద పడినట్లే కదా? మరి అలాంటి సున్నితమయిన అవయవాలు శరీరంలో ఎన్ని వున్నాయో మీకు తెలుసా? వాటి మీద రేడియేషన్ ప్రభావం ఎంత ఉందో ఎవరయినా అధ్యయనం చేసారా? వాటి వివరాలు మీ దగ్గర వున్నాయా? గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలను బయటకి రావద్దనడానికి కూడా వెనుక ఇటువంటి శాస్త్రీయ కారణం వుండొచ్చు కదా? ఇప్పుడు సామాన్య ప్రజల్ని గ్రహణం సమయంలో భోజనం చెయ్యమని చెబుతున్నారు. మీరు తింటున్నారు. దీర్ఘ కాలంలో ఆ ఆహారం వల్ల ఏదయినా జరగరానిది జరిగితే మీరు దానికి బాధ్యత వహిస్తారా?

సూర్యుడి నుంచి గ్రహణం సమయంలో వచ్చే రేడియేషన్ ప్రభావాన్ని మన పూర్వీకులు సరిగ్గానే అంచనా వేసారనే విషయాన్ని మర్చిపోవద్దు. పూర్వం నుంచి ఒక జాతి మొత్తం అనుసరిస్తున్న విధానాన్ని విమర్శించే ముందు మనం దానికి సమర్దులమా , కాదా అన్న విషయాన్ని ఆలోచించుకోవాలి. గ్రహణ సమయాన్ని, సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఆర్యభట్టు మన దేశానికి చెంది వాడేనని, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఖగోళ అంశాలపై భారతీయులు పట్టు సాదించారని మరచిపోతే ఎలాగ?

సంపూర్ణ సూర్యగ్రహణానంతరం గ్రహణాతీతుడైన శ్రీ కాళహస్తీశ్వరుడిని దర్శించుకోండని పండితులు అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తిలో వెలసిన ముక్కంటి దేవాలయం గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ ప్రాంతంలో పరమేశ్వరుడు స్వయంభులింగంగా వెలసి భక్తులకు దర్శనమిస్తున్నాడు.

వాయులింగేశ్వరుడు, సర్వదోషహరుడు, శ్రీ కాళహస్తీశ్వరుడిగా పిలువబడే ఈ శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. "దక్షిణ కాశి"గా ప్రసిద్ధి చెంది, ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాళహస్తీశ్వరుని గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్ర్యం, దోషాలు తొలిగిపోయి.. సకల సంపదలు చేకూరుతాయని ఆలయ పండితులు చెబుతున్నారు.

అందుకే దేశంలోని ఆలయాలన్నీ గ్రహణం రోజున మూతపడినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతేగాకుండా ముక్కంటికి గ్రహణకాలంలోనే గ్రహణ కాలాభిషేకాలు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ కాళహస్తిలో ఒక్క శనీశ్వరుని తప్ప నవగ్రహాలను ప్రతిష్టించకూడదు.

అందుకు బదులుగా ఈ క్షేత్రంలో రాహుకేతు గ్రహాలు నెలకొని ఉన్నాయి. రాహుకేతు దోషాలను నివారించే దివ్యశైవక్షేత్రం కాళహస్తి కాబట్టి, సూర్య, చంద్రగ్రహణ దోషాలు ముక్కంటిని ఏమాత్రం అంటవని పండితులు అంటున్నారు. దీంతో శ్రీకాళహస్తీశ్వరుడు గ్రహణాతీతుడుగా పిలువబడుతున్నాడని పురోహితులు చెబుతున్నారు.
ఇంకా ఆలయ పరిసరాల్లో 36 తీర్థాలున్నాయని, సూర్యగ్రహణానంతరం ఈ తీర్థాల్లో స్నానమాచరించి, వాయులింగేశ్వరుడిని దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు, అష్టైశ్వర్యాలు, సకల భోగభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం.
----------------
సూర్యగ్రహణం కాలంలో "డ్రాగన్" అనే ఒక వింతజీవి సూర్యుడిని మింగేస్తుందని ప్రాచీన చైనా ప్రజలు నమ్మేవారు. అందుకనే గ్రహణ సమయంలో వారు డప్పులు, వాయిద్యాలతో పెద్దగా శబ్దాలు చేస్తూ విల్లంబులను ఆకాశంవైపు ఎక్కుపెట్టేవారు. అలాగే కోపోద్రిక్తులైన కొంతమంది దేవుళ్లు ఆగ్రహం చెందటంవల్లనే గ్రహణం ఏర్పడుతుందని ప్రాచీన గ్రీకు ప్రజలు నమ్మేవారు. ఇక మనదేశంలోనివారు "రాహువు" అనే రాక్షసుడు సూర్యుడిని మింగేయటంవల్లనే గ్రహణం ఏర్పడుతుందని బలంగా నమ్మేవారు.

అంతేగాకుండా మన భారత దేశంలో సూర్య చంద్ర గ్రహణాలపై పలు భయాలున్నాయి. ఈ గ్రహణాల వల్ల గర్భస్థ శిశువులకు హాని జరుగుతుందని భావిస్తారు. గ్రహణం రోజున బయట తిరిగితే అరిష్టమని భారతీయ స్త్రీలు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే కడుపుతో ఉన్నవారిని ఇంట్లోనే ఉంచుతారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు. నిద్రపోనివ్వరు, ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతుంటారు.

గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిదని, అంతేగాక తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలని వారు అన్నారు. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు హెచ్చరించారు. గ్రహణం ఏర్పడటానికి మూడు గంటల ముందు, ఏర్పడిన అనంతరం మరో మూడు గంటల వరకు పసి పిల్లలు, వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని, యుక్తవయస్కులు మాత్రం గ్రహణ సమయానికి 12 గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.

అలాగే, గ్రహణం రోజున ముందుగా వండిన పదార్థాలను కూడా పారవేస్తారు. అన్ని దేవాలయాలనూ మూసివేస్తారు. దోష నివారణకు ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహణాల సమయంలో ముస్లింలు కూడా సలాతుల్-కుసుఫ్ అనే ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఇక చైనీయులయితే 19వ శతాబ్దంలో సంభవించిన గ్రహణం సమయంలో డ్రాగన్‌ను తరిమేసేందుకు ఆ దేశ నౌక దళం ఫిరంగులు పేల్చినట్లుగా కూడా చెబుతుంటారు.

ఈ సంగతిని అలా కాసేపు పక్కనపెడితే.... అసలు నిజంగానే సూర్యుడిని రాహువు, డ్రాగన్‌లు మింగేస్తాయా...? అనే కోణంలో చూస్తే... సైన్సుపరంగా, శాస్త్రీయపరంగా, ఖగోళశాస్త్రం ప్రకారం... అలాంటిదేమీ లేదని తేలిపోయింది. సూర్యుడిని రాహువుగానీ, డ్రాగన్ గానీ మింగేయవని ఖగోళ శాస్త్రజ్ఞులు శాస్త్రీయంగా నిరూపించారు. అదేంటంటే...

సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో భూమిమీద కొంత భాగానికి సూర్యుడు కనిపించకుండా పోతాడు. ఈ సూర్య గ్రహణం గరిష్ట స్థాయిలో 7.5 నిమిషాలు ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతాలలో గ్రహణం ఛాయ గంటకు 1,100 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ధ్రువాల వద్ద ఈ వేగం 5 వేల మైళ్లుగా ఉంటుంది.

సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించే సమయంలో స్థానిక ఉష్ణోగ్రత కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి 18 సంవత్సరాలకు ఒకసారి దాదాపు ఒకే రకమైన (పూర్తి, వార్షిక, పాక్షిక) గ్రహణాలు ఏర్పడుతుంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడే ప్రాంతం నుంచి దాదాపు 3 వేల మైళ్లవరకూ పాక్షిక గ్రహణాన్ని వీక్షించవచ్చు.

జూలై 22, 2009న సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం అంతటి సుదీర్ఘ గ్రహణాన్ని మళ్లీ వీక్షించాలంటే... 2,132 సంవత్సరాల దాకా ఆగాల్సిందే..! అంటే మన తరువాత తరం ప్రజలు ఈ అద్భుతాన్ని చూసే అవకాశం వస్తుంది. భారత్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా దేశాల ప్రజలకు ఈ శతాబ్ది అద్భుతమైన సంపూర్ణ సూర్యగ్రహణ దర్శన భాగ్యం కలిగింది. మనదేశంలోని వారణాసిలో ఈ గ్రహణం మూడు నిమిషాలపాటు కనిపించి వీక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.

గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిదని, అంతేగాక తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలని వారు అన్నారు. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు హెచ్చరించారు. గ్రహణం ఏర్పడటానికి మూడు గంటల ముందు, ఏర్పడిన అనంతరం మరో మూడు గంటల వరకు పసి పిల్లలు, వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని, యుక్తవయస్కులు మాత్రం గ్రహణ సమయానికి 12 గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.

గ్రహణం పట్టే ముందుగా స్నానం చేసి జపం చేసుకుని గ్రహణానంతరం మరలా స్నానం చేసి మీ ఇంటి లోనున్న పూజా గృహాన్ని శుద్ధి చేసుకుని పటాలు లేక విగ్రహాలను కూడా ఆవుపాలు శుద్ధ జలంతో శుద్ధిపరచుకుని వారికి ఉపచారాదులు[పూజ] చేసుకోవాలి. తదనంతరం మాత్రమే ఏదైనా స్వీకరించాలి. పొద్దుటే టీ- కాఫీలు త్రాగేవారు రేపొద్దున్న ఒక్కపూట ఆ అలవాటుకు మానుకోవటం మంచిది.

తమకర్ధం కాకపోయినా ఇదెందుకు అనే వితండవాదుల వాదనలతో సమయము వృధాపుచ్చుకోక మనపెద్దలు ఘన విజ్ఞానులనే విషయము నమ్మి వారు చూపిన బాటలో శుభాలకోసము ప్రయత్నం చేద్దాము


గ్రహణ సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి...!


గ్రహణ సూతకము 21 జులై నెల 2009న సూర్యాస్తమైన సమయంనుంచే ప్రారంభమౌతుంది. గ్రహణంలో వర్జిత పనులు, గ్రహణ సూతకము మరియు గ్రహణ కాలంలో భోజనం చేయడం, నీరు త్రాగడం, సంభోగాది కార్యాలు చేయరాదు. గ్రహణం సమయంలో నిద్రపోవడం, మలమూత్రాదులు విసర్జించడం, తైలాభ్యంగన స్నానం చేయకూడదు.

గ్రహణ సూతకంలో పిల్లలు, వృద్ధులు, రోగాలతో బాధపడుతున్నవారికి తినడంపై ఎలాంటి నిషిద్ధం లేదు. గ్రహణం పట్టిన సమయంలో వండిన అన్నం, తరిగిన కూరగాయలు, పండ్లు కలుషితమౌతాయి. వీటిని భుజించకూడదు.

కాని నూనె, నెయ్యితో చేసిన వంటకాలు ఉదాహరణకు అన్నం, నెయ్యి, నూనె, పాలు, పెరుగు, లస్సీ, వెన్న, పన్నీరు, ఊరగాయలు, చట్నీ, మురబ్బాలో నువ్వులు లేదా దర్బలు ఉంచితే ఆ పదార్థాలు కలుషితం కావంటున్నారు జ్యోతిష్యులు. డ్రై ఫుడ్‌లపై నువ్వులు లేదా దర్బలు ఉంచాల్సిన అవసరం లేదు.

గ్రహణం సమయంలో ఏదైనా మంత్రాన్ని పఠిస్తే అది శీఘ్రంగా ఫలిస్తుందంటున్నారు జ్యోతిష్యులు. ప్రధానంగా మహా మృత్యంజయ మంత్రాన్ని జపిస్తే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అందునా శ్రావణమాసం ప్రారంభమౌతుంది. ఏదైనా కార్యం సిద్ధించేందుకు మంత్రాన్ని జపించాలనుకునేవారు ఇలాంటి సమయంలో జపిస్తే ఉత్తమమం అంటున్నారు జ్యోతిష్యులు.

గర్భిణీ స్త్రీలు గ్రహణం పట్టే సమయంలో సూర్య కాంతికి కూర్చోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం.. ఇత్యాది వంట పనులు చేయకూడదు.

ఈ గ్రహణం పట్టే కాలంలో వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్రాన్ని జపించండ వల్ల ఫలితం ఆశాజనకంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.
-------------------------------------

సూర్యగ్రహణం గురించి కొన్ని విషయాలు...!

భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్యగ్రహణము ఏర్పడుతుంది. సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో సూర్య, చంద్ర గ్రహణాలను అశుభ సూచకముగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు.

అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై చీకటి కమ్ముకోవడం వలన అప్పట్లో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు. విజ్ఞాన శాస్త్రం గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇటువంటి నమ్మకాలు తగ్గుతూ వచ్చినా ఇంకా గ్రహణంపై పూర్తిగా అనుమానపు గ్రహణాలు తొలగలేదంటున్నారు శాస్త్రజ్ఞులు


** సూర్యగ్రహణం గురించి ప్రామాణికంగా యూనాని చరిత్రలో లభ్యమవుతుంది. సూర్యగ్రహణంగురించి బెవోలియన్‌కు చెందిన ప్రాచీనకాలంనాటి వ్యక్తులు క్రీస్తు పూర్వం 2000కు మునుపు భవిష్యవాణి చెప్పేవారు.

** ప్రముఖ యూనాని దార్శనికుడు హేరోడోట్స్‌కూడా థేల్స్ యుద్ధం జరిగే సమయంలో గ్రహణంగురించి వర్ణించి ఉన్నాడు.

** 21 ఆగస్టు 1560న ఫ్రాన్స్‌లోని ప్రజలు సూర్య గ్రహణం కారణంగా తమను తాము ఇంట్లో బంధించుకున్నారు.

** క్రీస్తు పూర్వం 2136లో చైనాలో గ్రహణం ఎలా వీక్షించాలి అనేదానిపై ఓ ప్రత్యేకమైన దస్తావేజు లభించింది. అన్ని గ్రహణాలకంటే 1955లో ఏర్పడ్డ సూర్యగ్రహణం ఎక్కువ సమయం తీసుకున్నదట. దీని కాలపరిమితి 7నిమిషాల 51 సెకండ్లు.

** 1973లో కంకార్డ్ విమానంలో శాస్త్రజ్ఞులు తమ తమ సాధనాలతో గ్రహణాన్ని వీక్షించేందుకుగాను తగిన పరికరాలను ఉపయోగించి మూడు వేల కిలోమీటర్ల మేరకు ఆకాశంలో ప్రయాణించారు. ఇలా దాదాపు 72 నిమిషాలపాటు గ్రహణం ఎలా సంభవిస్తుందన్న అంశంపై పరిశోధించారు.

** సూర్యగ్రహణానికి చెందిన తొలి ఫోటోగ్రాఫ్ క్రీస్తుశకం 1851లో చిత్రీకరించడం జరిగింది. సూర్యగ్రహణానికి సంబంధించి శాస్త్రజ్ఞులు ఫోటోగ్రఫీని క్రీస్తుశకం 1860లో ఉపయోగించారు.

** గ్రహణాలను అధ్యయనం చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే... సూర్యుని బయటి ప్రాంతం గులాబీ రంగులో మెరుస్తుంటుంది. దీనిని సోలార్ ప్రామినెన్సిస్ అంటారు. ఋగ్వేదంలో సూర్యుడిని వర్ణిస్తూ...మహర్షి అత్రిమహాముని వీటిని రక్తాభమేష్ అని వర్ణించియున్నారు.

** గ్రహణం సమయంలో సూర్యుడు గోళాకారంలో పరివర్తనం చెందుతుంటాడని శాస్త్రజ్ఞలు చెపుతున్నారు.
--------------------------
రాశులపై సూర్యగ్రహణం ప్రభావం...!

22 జులై 09న సంభవించే సూర్యగ్రహణం అటు ఖగోళశాస్త్రజ్ఞులు మరియు జ్యోతిష్యశాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సూర్యగ్రహణం కర్కాటకరాశిలో జరుగుతుంది. (సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తుంటాడు)

వివిధ రాశులపై ఈ సూర్యగ్రహణం ప్రభావం ఈ విధంగా ఉంటుందని జ్యోతిష్యశాస్త్రజ్ఞుల చెపుతున్నారు.

మేషం : సూర్యగ్రహణం కారణంగా ఈ రాశివారికి అశుభ ఫలితాలు, ప్రభుత్వ పరంగా హాని, వృత్తి, ఉద్యోగాలలో కష్టాలు, తండ్రికి కష్టాలు, కుటుంబంలో కలహాలుంటాయంటున్నారు జ్యోతిష్యులు. సూర్యారాధన వల్ల ప్రభావం తగ్గించుకోవచ్చు.

వృషభం : సూర్యగ్రహణం కారణంగా ఈ రాశివారికి శుభ ఫలితాలుంటాయి. మీ ధైర్యసాహసాలకు పెట్టింది పేరుగా ఉంటుంది. సోదరసోదరీమణులతో సంబంధ బాంధవ్యాలు బలపడుతాయి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది.

మిథునం : ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ధనలాభం, కుటంబంలో కష్టాలు, ఖర్చులు అధికమౌతాయి.

కర్కాటకం : సూర్యగ్రహణం కారణంగా ఈ రాశివారికి అశుభ ఫలితాలుంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. మానసికమైన ఈతి బాధలు, పనులలో ఆటంకాలు ఎక్కువవుతాయి. సూర్యారాధన వల్ల ఇటువంటి సమస్యలను అధిగమించవచ్చు.

సింహం : అశుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. ఈ రాశివారు జామీనులు ఇవ్వడం వలన ఇబ్బందులకు గురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాజ్యము వలన భయం, దుర్ఘటనలు సంభవించే సూచనలు అధికంగా కనపడుతున్నాయని జ్యోతిష్యులు అంటున్నారు.

కన్య : సూర్యగ్రహణం కారణంగా ఈ రాశివారికి శుభ ఫలితాలుంటాయి. ధన లాభం, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శుభ సమాచారాలు వింటారు.

తుల : సూర్యగ్రహణం వీరికి శుభకారకంగా ఉంటుంది. ప్రభుత్వంనుంచి లాభం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సన్మానాలు, పురస్కారాలు లభించే యోగం ఉంటుంది.

వృశ్చికం : సూర్యగ్రహణం కారణంగా ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ధార్మిక యాత్రలు చేస్తే మంచి యోగం కలుగుతుంది. గురువు శుభదృష్టి వలన అదృష్టం బాగుంటుంది.

ధనస్సు : క్లిష్ట సమయం. అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, మానసికపరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. సూర్యారాధన వల్ల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

మకరం : మిశ్రమ ఫలితాలు, వీదేశాలలో నష్టాలు, జీవిత భాగస్వామితో సుఖం, వ్యాపారంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి.

కుంభం : సూర్యగ్రహణం కారణంగా ఈ రాశివారికి శుభ ఫలితాలుంటాయి. ధన లాభం, ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యసిద్ధి.

మీనం : మిశ్రమ ఫలితాలు, సంతానంతో సుఖం, ఆర్థికంగా సాధారణ పరిస్థితి ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.

గమనిక : సూర్యగ్రహణం కారణంగా ప్రభావం దాదాపు మూడు నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. అశుభ పరిణామాలనుంచి బయటపడేందుకు సూర్యారాధన చేయండి. మీ రాశినిబట్టి దానం చేయండి. ఇష్ట దైవారాధన చేయండి. ఎట్టి పరిస్థితుల్లోను గ్రహణాన్ని చూడకండి.

















================================================

Visit My Website - > Dr.Seshagirirao

No comments: