Wednesday, November 3, 2010

బలరామావతారము , Balarama Avataaram



బలరామావతారము అంటే మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఇది ఒకటి. బలరాములు వారు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము , నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు. వీరి భార్య రేణుక.

ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు, మరొకసారి హస్తినాపురాన్నే నేటి ఢిల్లీని తన హలాయుధంతో యమునలో కలప ఉద్యుక్తులయినారు. వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసినారు. శ్రీకాకుళం జిల్లా నాగావళి నది ఆవిర్భావానికి ... నాగావళి నదీతీరాన పంచలింగాల ప్రతిష్టకి ఈయనే కారణము .

భారత భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తావన వచ్చిన కొన్ని కొన్ని సందర్భాలలో బలరాముడిని గురించి కూడా కొన్ని వివరణలు, కథలు కనిపిస్తాయి. బలరాముడు భగవానుడి దశావతారాలలో ఒక అవతారంగా కూడా ఉన్నాడు. శ్రీమహావిష్ణువు శ్వేతతేజస్సు బలరాముడుగానూ, నీలతేజస్సు శ్రీకృష్ణుడిగానూ అవతరించి దుష్టశిక్షణ కోసం తమ అవతార కాలాన్నంతా సద్వినియోగం చేసినట్లుగా అనిపిస్తుంది. దేవకీదేవికి సప్తమగర్భం కలిగింది. అప్పుడు దేవకిని, వసుదేవుడిని కంసుడు చెరసాలలో బంధించాడు. ఆ సమయంలో యముడు తన యామ్యమైన మాయతో దేవకీదేవి నుంచి గర్భాన్ని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. బలరాముడికి ఈ సందర్భంలోనే సంకర్షణుడు అనే పేరు వచ్చింది. సంస్కృత మర్యాద ప్రకారం సమ్యక్‌ కర్షణాత్‌ అంటే సంపూర్తిగా ఆకర్షించడం వల్ల ఆయన సంకర్షణుడు అనే పేరుతో కూడా మనకు కనిపిస్తాడు. బలవంతులందరిలోనూ శ్రేష్టుడు కనుక బలదేవుడు అన్నారు. రామశబ్దానికి సుందరం అనే అర్ధం ఉంది కనుక ఆయన బలరాముడయ్యాడు. శ్రీకృష్ణుడికి అన్న అయిన బలరాముడు ఆదిశేషుడి అవతారం కూడా. సాందీప్‌ అనే గురువు దగ్గర బలరామకృష్ణులిద్దరూ విద్యాభ్యాసం చేశారు. ఈ బలరాముడు శ్రీకృష్ణుడిలాగే పాండవులంటే కొంత ఆదరాభిమానాలు కలిగివున్నా ఈయనకు కౌరవులలో దుర్యోధనుడంటే కూడా బాగా ఇష్టం అని కొన్ని కొన్ని భారత కథాఘట్టాల వల్ల తెలుస్తుంది. ఈయన భార్య పేరు రేవతీదేవి. నాగలి, రోకలి, బలరాముడి ప్రధాన ఆయుధాలు. ఎప్పుడూ నీలరంగు వస్త్రాలనే ధరిస్తుంటాడు. ఈయన జండామీద తాటిచెట్టు గుర్తు ఉంటుంది. గధాయుధంలో బలరాముడు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు. భీముడు, దుర్యోధనుడు ఇద్దరూ ఈయన దగ్గర గదాయుద్ధ విద్యను నేర్చుకున్నారు. విశేషించి దుర్యోధనుడు, పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు భీముడిని జయించాలన్న లక్ష్యంతో ఈయన దగ్గర ఎన్నెన్నో గదాయుద్ధ మెళుకవలను నేర్చుకున్నాడు. ద్రౌపది వివాహంలోనూ, ధర్మరాజు ఇంద్రప్రస్థ రాజధాని ప్రవేశ సమయంలోనూ శ్రీకృష్ణుడితోపాటుగా బలదేవుడు కూడా ఉన్నాడు. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ చిన్ననాటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సుభద్రను వివాహమాడటంకోసం యతి వేషంలో బలరాముడు దగ్గరకు వెళ్ళాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సహకరించాడు కూడా. కానీ అర్జునుడు సుభద్రను అపహరించి చేపట్టడం బలరాముడికి నచ్చలేదు. అర్జునుడి సాహసాన్ని క్షమించలేనని బలరాముడు తీవ్రంగా కోపగించుకున్నాడు. అయితే శ్రీకృష్ణుడు అతడిని శాంతపరిచి కోపం తగ్గించుకునేలా చేశాడు. పాండవులు వనవాసం చేసే రోజుల్లో తీర్థయాత్రలు చేస్తూ ప్రభాసతీర్థం దగ్గరకు వెళ్ళినప్పుడు బలరాముడు, మరికొందరు యాదవ వీరులను తీసుకొని వారిదగ్గరకు వెళ్ళి వారిని పరామర్శించాడు. ఆ తర్వాత వనవాసం, అజ్ఞాతవాసం అన్నీ పూర్తికావటం ఉత్తర, అభిమన్యుల వివాహం కూడా జరిగాయి. ఆ సందర్భంలో అక్కడ ఉన్న బలరాముడు పాండవులకు, కౌరవులకు హితకరంగా రాజ్యవిభాగం ఎలా జరిగితే బాగుంటుందో ఆలోచించాలన్నాడు. ఇక్కడే ఇతడికి దుర్యోధనుడంటే అభిమానం ఉందన్న విషయం వ్యక్తమవుతుంది. అయితే యుద్ధసమయంలో పాండవులు, కౌరవులు ఇద్దరూ తనకు కావాల్సివారేనని కనుక తాను ఏ పక్షానికి ఎలాంటి సహాయం చేయకుండా తటస్ఠంగా ఉన్నాడు. ఈ తటస్ఠ లక్షణాన్ని నిలుపుకోవడానికి ఆయన కురుక్షేత్ర యద్ధ సమయంలో సరస్వతీ నదీ తీరంలో ఉన్న తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళాడు. నలభైరెండురోజుల తీర్థయాత్ర ముగించుకొని కురుక్షేత్ర సంగ్రామం చిట్టచివరిలో భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధం చేసుకునే సమయానికి తిరిగి వచ్చాడు. ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలు విరగగొట్టడం గదాయుద్ధ ధర్మం కాదని తీవ్రంగా తన నిరసనను, ఆగ్రహాన్ని వ్యకపరిచాడు. అయితే శ్రీకృష్ణుడు కలగజేసుకొని దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి శాపం ఉందని, దాంతోపాటుగా భీముడు చేసిన ప్రతిజ్ఞ కూడా ఉందని గుర్తుచేసి సర్దిచెప్పడంతో కొద్దిగా బాధపడుతూనే రథమెక్కి ద్వారకకు వెళ్ళాడు. కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత కొద్దికాలానికి మహర్షుల శాపం వలన యాదవ వంశం నాశనమైంది. ఓ రోజున బలరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ అరణ్యానికి వెళ్ళారు. అక్కడ బలరాముడు ఓ చెట్టుకింద కూర్చొని ధ్యానంలో నిమగ్నమయ్యాడు. అప్పుడు ఆయన నోటినుంచి ఒక తెల్లటి సర్పం బయటకు వచ్చి పడమటి సముద్రంలో లీనమైంది. బలరాముడు ఆదిశేషుడి అంశ అని అనడానికి ఇది ఒక నిదర్శనం. శ్రీకృష్ణుడితోపాటే అనేక రాక్షసుల సంహారంలో పాల్గొన్న కృష్ణుడికి అన్నగా, తనదైన ఓ ప్రత్యేకతను బలరాముడు తుదిదాకా నిరూపించుకుంటూనే వచ్చాడు.

-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు.
బలరాముని పరాక్రమమును తెలియజేసే ఒక కధ :
జాంబవతి కొడుకు సాంబుడు, దుర్యోధనుడి కూతురు లక్ష్మణ స్వయంవరానికి పిలవకపోయినా వెళ్లి, బలాత్కారంగా ఆమెని యెత్తుకుపోయాడు. కౌరవులకప్పుడు చాలా కోపమొచ్చింది. "ఎంత కావరం? మనం దయదలచి యిచ్చిన భూమిని అనుభవించే యాదవులు రాజులతో యెలా సమానమవుతారు? వారి పనిపడదాం" అని నిశ్చయించారు.

కర్ణుడు, శల్యుడు, దుర్యోధనుడు, మొదలైనవారు ఆ సాంబుడిని వెంబడించారు. వెంటవస్తూన్న వారిని చూసి సాంబుడు బాణాలు తీసి, ఒక్కడే అయినా ధైర్యంగా వారందరి తోనూ యుద్ధానికి సిద్ధపడ్డాడు. కర్ణుడిని ముందు పెట్టి కౌరవులు యుద్ధం చేసి సాంబుడిని బంధించాలని చూసారు. కర్ణుడు కూడా మెచ్చుకునేటంత పరాక్రమంతో సాంబుడు పోరాడేడు. అప్పుడు వారందరూ ఏకమయి బాణాలు కురిపిస్తే పాపం, ఒక్కడూ అంతమందితో యేం చేయగలడు? ఓడిపోయాడు. వారు సాంబుడిని బంధించి హస్తినాపురికి తీసుకుపోయారు.

నారదుడు వెళ్లి సాంబుడిని కౌరవులు బంధించి తీసుకుపోయిన సంగతి ద్వారకలో చెప్పాడు. యాదవులు యుద్ధానికి తయారవబోతే, బలరాముడు వద్దన్నాడు. తను ఒక్కడే రథమెక్కి హస్తినాపురికి బయలుదేరాడు.

ఊరుబయట ఆగి, తన రాక కౌరవులకి చెప్పమని బలరాముడు ఉద్ధవుని పంపించాడు. కౌరవులు కూడా ఆ వార్త విని సంతోషించి, కానుకలతో బలరాముడి దగ్గరకు వెళ్లారు. బలరాముని ప్రభావం తెలిసినవారు కనుక అతనికి సాష్టాంగ ప్రమాణం చేసారు. ఉభయ కుశలోపరులు అయేక బలరాముడు, "మీలో చాలామంది కలిసి ఒక్కడిని అధర్మంగా జయించి బంధించారు. మనం బంధువులమంతా కలిసిమెలిసి ఉండాలని దానిని సహించి ఊరుకున్నాను" అన్నాడు. అది వినగానే కౌరవులు మండిపోయారు. "కుంతి వివాహంతో బంధుత్వాలు కలుపుతున్నారు. వీళ్లు, ఈ యాదవులు, సిగ్గుమాలి, మనలని ఆజ్ఞాపించేవారయేరేం?" అని అనుకుని, వారు బలరాముని నానా మాటలూ అని తిరిగి వెళ్లిపోయారు.

వారి చెడ్డ ప్రవర్తన చూసి, బలరాముడు, "వీళ్లకి పొగరెక్కింది. ఎంతో కష్టం మీద నేను మా యాదవులని కయ్యమొద్దని ఊరడిస్తే, యిదా వీరి వాలకం? మేము వారికి తగమే? ఇదుగో, యీ క్షణమే భూమి మీద కౌరవుడన్న వాడు లేకుండా చేస్తా" అని నాగలి యెత్తి ప్రళయరుద్రుడిలా లేచాడు.

హస్తినాపురిని గంగలో ముంచేయడానికి నాగలితో దక్షిణపు గోడవైపున ఉన్న భాగాన్ని నదిలోకి విసిరాడు. అది ఓ చిన్న పడవలా గంగలో పడడం చూసి కౌరవులంతా బలరాముని శరణుకోరడానికి సాంబుని విడిపించి లక్ష్మణ తోడుగా అతని దగ్గరకు పరుగెత్తి, "శరణు, శరణు, మా తప్పుని మన్నించు" అని ప్రాధేయపడ్డారు.

పెళ్లి కట్నంగా వేయి ఏనుగులనీ, రెండువందల గుర్రాలనీ, నాలుగు వేల రథాలనీ, వేయి మంది పరిచారికలనీ ఇచ్చి దుర్యోధనుడు సాంబుడికి లక్ష్మణనిచ్చి వివాహం చేసాడు. సాంబుడినీ, ఆ కోడలునీ తీసుకుని అందరూ స్తోత్రం చేస్తూండగా, బలరాముడు ద్వారకకి వెళ్లాడు.

ఇప్పటికీ హస్తినాపురి దక్షిణపు గోడ గంగానదివైపు ఒరిగి ఉన్నట్లు పొడుగ్గా కనబడుతుందెందుకంటే, ఆనాడు బలరాముడు చేసిన పని మూలాన్నే అని అంటారు.

- మూలము : వికీపెడియా
  • =================================
Visit My Website - > Dr.Seshagirirao

1 comment:

Anonymous said...

really an eye opener for me.

- Robson