Monday, September 13, 2010

Rushipanchami , ఋషిపంచమి


----

ఋషిపంచమి :
మన ప్రాచీన రుషులను పూజించేవ్రతం రుషిపంచమి. భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ రుషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ రుషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు. మరీచి రుషి వంశం వరసగా వివవస్వత్‌ క్రమంగా శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది.

ఎంతోమంది రుషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులు. రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు. సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి. భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు. విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే. జమదగ్ని రుషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు. ఏడో రుషి వసిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు. స్వాయంభువ మన్వంతరంలోనూ సప్తరుషుల్లో ఒకడు. ఒకప్పుడు మిత్రా వరుణులకు ఊర్వశిని చూసి రేతస్సు స్ఖలితం కాగా కుండలో వసిష్ఠుడు, అగస్త్యుడు జన్మించారని ప్రతీతి. సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాతఃకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు. అందుకే భాద్రపద శుక్లపక్ష పంచమి రోజున స్త్రీలు తమ పూర్వకృత దోష పరిహారం కొరకు విధివిధానంగా పూజిస్తారు. ప్రతి రుషిపంచమికి సుమంగుళులు రుషులను పూజించి తమ దోషాలను దూరం చేసుకొని, ఆయువు, బలం, యశస్సు, ప్రజ్ఞ పొందగలరని వ్రతవిధానం తెలుపుతోంది. సప్తర్షుల ప్రతిమలు చేయించి, షోడశోపచారాలతో పూజించి, రుత్విక్కులను సంతుష్టులను చేసి, భోజనం ఏర్పాటు చేస్తారు. వారి ఆశీర్వాదాలందుకుంటారు. అలా చేసినవారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శ్రీకృష్ణ పరమాత్మ వివరించినట్లు పౌరాణిక వ్రతకథలు తెలుపుతున్నాయి. ప్రాచీన రుషులను పూజించే రుషిపంచమి భారతీయ సంస్కృతిలో చిరస్థాయిగా నిలుస్తుంది. -డాక్టర్‌ మాడుగుల భాస్కరశర్మ

ఋషిపంచమి వ్రతము ను స్త్రీలు తప్పక ఆచరించాలి . వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని " ఋషిపంచమి " అంటారు . సప్త ఋషులు ఆరోజు తూర్పున ఉదయిస్తారు . బ్రహ్మ విద్య నేర్వవలసినరోజు . సప్తఋషుల కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి . . . గనుక బ్రాహ్మీ ముహూర్తముననే లేచి ధ్యానం చేసుకోవాలి . సప్తఋషులే గాయత్రీమంత్రానికి మూలగురువులు . మానవుని శరీరం లో ఏడు యోగచక్రాలు ఉంటాయి , వాటిని వికసింపజేసే వారే ఈ సప్తఋషులు .
మొట్టమొదటిసారిగా వేదమంత్రాల్ని దర్శించి వైదిక ధర్మాన్ని ప్రవర్తింపజేసిన ఆద్య హిందూఋషుల్ని స్మరించే శుభసందర్భం... భాద్రపద శుద్ద పంచమి . ఆ రోజున ఉపవాసం ఉంటే ఆ తొలిగురువులు మిక్కిలి ప్రసన్నులయి మనం కోరిన కోరికలు తీఱుస్తారు. ముఖ్యంగా స్త్రీలు రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే వారికీ, వారి సంతానానికీ తరతరాల పాటు ఆయురారోగ్య సౌభాగ్యాల్ని అనుగ్రహిస్తారు. సంపూర్ణ ఉపవాసం అంటే రెండు పూటలు ఉప్మా తీసుకోవచ్చు. అత్తలకి శక్తి లేకపోతే కోడళ్ళయినా ఉపవాసం చేయాలి. సర్పదోషాలతో బాధపడుతూ సంతానం లేక బాధపడేవారికి మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చెయ్యడం వంశవృద్ధికరం. ఐశ్వర్యదాయకం.

కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదురుణాల్లో ఋషిరుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లేమరి. ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ!

దేవుడు ఎంత కరుణామయుడో చూశారా! ఇది చెయ్యి అంటాడు. పోనీ, చేతకాకపోతే కనీసం చెప్పినదానిలో సగమైనా చెయ్యమంటాడు అదీకుదరక పోతే అందులో సగం చెయ్యమంటాడు. ఎన్ని మినహాయింపులో చూశారా! అయినా ఆయన్ను తలవలేకపోతున్నాం. కొలువలేకపోతున్నాం. సరే! ఏడుగుర్ని కాకపోయినా వీరిలో ఐదుగురినైనా తప్పనిసరిగా ఈ భాద్రపద శుద్ధ పంచమినాడు స్మరించుకుని అర్చించాలన్నారు. అందుకే ఈరోజును ఋషిపంచమి అన్నారు.

ఆ ఐదుగురూ ఎవరంటే త్రిగుణాతీతుడైన అత్రి, ఈయన భార్య అనసూయ. వీరిద్దరూ దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉద్ధరించిన జంట. ముఖ్యంగా ప్రస్తుతం ఈ జంటను పూజించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండవవారు భరద్వాజుడు. ఆపై గాయత్రీమంత్ర సృస్టి విశ్వామి త్రుడు, వసిష్ఠుడు, జమదగ్ని. ఈ ఐదుగురినీ పూజించే రోజే ఋషిపంచమి.

నిజానికీ పండుగ స్త్రీలకు సంబంధించింది. ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఆచరించుకునే వ్రతం. దీన్ని భాద్రపద మాసం శుద్ధపంచమిరోజున ఆచరిం చాలని భవిష్యోత్తరపురాణం తెలియచేస్తోంది. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్వల సమయంలో చేసిన దోషాలన్నీ పరిహారమవుతాయని బ్రహ్మ దేవుడు శితాశ్వుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియచేస్తోంది.

వ్రత విధానం

తప్పనిసరిగా ప్రతిస్త్రీ ఈ వ్రతాన్ని ఏడాదికోమారు చేసుకోవలసిందే! ఈరోజు సప్తఋషులను వారి భార్యలతోసహా పూజించుకోవాలి. ఈ వ్రతం చేసుకునేందుకు విధిగా ఈ నియ మాల్ని పాటించాలి. ఉత్తరేణి మొక్కను వేళ్లతో సహా పెరికి దాని కొమ్మతో ఉదయాన్నే పళ్లు తోముకోవాలి. అనంతరం గంగా జలం, బురద, తులసిచెట్టులోని మట్టి, ఆవుపేడ, రావిచెట్టుమట్టి, గంధపు చెక్క, నువ్వులు, గోమూత్రం వీటి నన్నింటిని కలిపి చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆపై108 చెంబులతో స్నానం చెయ్యాలి. స్నానం నదిలో గానీ, ఇంటిలోగానీ చెయ్యవచ్చు. స్నానం చేస్తున్న సమయంలోనే వ్రతానికి సంకల్పం చెప్పుకోవాలి. ఈ వ్రతాన్ని ముత్తైదువులు చేస్తుంటే తిల అభ్యంగ స్నానం చేసి పసువు, కుంకుమల్ని ధరించి పూజకు కూర్చోవాలి. అదే వితంతువలు చేస్తున్న పక్షంలో విబూది, గోపి చందనం, పంచగవ్యాలతో స్నానం చెయ్యాలి. ఇలా చేసిన అనంతరమే పూజకు ఉపక్ర మించాలి.

పూజామందిరం వద్ద గణపతి, నవగ్రహాలు, షోడశ మాతల్ని ప్రతిష్టించుకుని కుదిరితే సప్త రుషులందరినీ భార్యలతో సహా, లేదా అత్రిఅనసూయలు,అరుంధతీవసిష్ఠు లచిత్రాలుంచి పంచామృతాలు, నీటితో అభిషేకం చెయ్యాలి. కుంకుమ,గంధం, బియ్యం, పూలు పళ్లు, తమల పాకులు, యాలకులు, లవంగాలు, దక్షిణఉంచి వ్రతకథ చెప్పు కుని హారతి సమర్పించి నమస్కరించుకుంటారు.

వ్రతకథ

విదర్భదేశంలో ఉత్తమకుడనే బ్రాహ్మణుడికి కూతురు, కొడుకుఉన్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆడపిల్లకు పెళ్లైన కొద్దిరోజులకే వైధవ్యం ప్రాప్తిస్తుంది. దాంతో ఆమెను తీసుకుని గంగాతీరంలో బ్రాహ్మణజంట నివాసముంటారు. ఒకరోజు ఆ అమ్మాయి శరీరంలో నించి పురుగులు పడడం గమనిస్తాడు ఉత్తంకుడు. అయితే ఆయన మంచి దైవభక్తుడు కావడంతో తన కుమార్తెకిలా ఎందుకు జరుగుతోందో దివ్య దృష్టితో గమనిస్తాడు. పూర్వజన్మలో ఈమె రజస్వలైనప్పుడు అన్నంగిన్నె తాకినందువల్ల ఇలా జరిగిందని తెలుసుకుంటాడు. వెంటనే ఈమెతో ఋషిపంచమి వ్రతం చేయించి ఆమె దోషాన్ని పరిహరింపచేస్తాడు. అలాగే-

ప్రాశస్త్యంలో ఉన్న మరో కథ: విదర్భ నగరంలో శ్వేతజితుడనే క్షత్రియుడు, సుమిత్ర అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేవారు. సుమిత్ర రజస్వల అయిన సందర్భంలో శ్వేతజితు డామెను తాకడం, మాట్లాడడం వంటివి చేస్తాడు. ఈమె కూడా ఆ సమయంలో అందరితోనూ మామూలుగానే మాట్లాడేది. ఇలా కాలం గడచి వారిద్దరూ మరణించి సుమిత్ర కుక్కగానూ, అతడేమో ఎద్దుగానూ జన్మించి సుమిత్ర కొడుకు గంగాధరం ఇంటికే చేరతారు. ఒకరోజు గంగాధరం సుమిత్ర ఆబ్దీకం నిర్వహిస్తున్నాడు. గంగాధరుడు తల్లికి శ్రాద్ధక్రియలు ఆచరించి పరమాన్నం నేవేద్యం పెడుతుండగా ఆ కుక్క వచ్చి దాన్ని ముట్టుకుంటుంది. దాంతో ఆ పాయసాన్ని పారబోసి వేరేగా వండి నైవేద్యం పెడుతుంది వంటమనిషి. తద్దినం పెట్టేది తనకే కదా అని పాయసం తింటే దాన్ని పారబోసి వేరే వండించాడని బాధ పడ్డ కుక్కరూపంలోని సుమిత్ర తన బాధను ఎద్దుతో చెప్పుకుంటుంది. వీరిద్దరి భాషా తెలిసిన గంగాధరమా మాటలు వినికుక్క రూపంలో ఉన్నది తల్లి అని తెలుసు కుని గురువు ద్వారా వారి రహస్యం తెలుసుకుని బుషిపంచమి వ్రతం ఆచరించి వారి దోషాల్ని పరిహరింప చేస్తాడు గంగాధరం.

కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే బుషిపంచమిని ప్రాయశ్చితార్థం చేసుకునే వ్రతంగానే చెప్పాలి. ఈ కంప్యూటర్‌ ప్రపంచంలో వ్రతాలు, నోములు అంటే వింతగా చూసినప్పటికీ మన పురాతన ఆచార వ్యవహారాల్నీ ఇప్పటికీ ఎంతో నిష్టగా ఆచరించేవారు ఎంతో మంది ఉన్నారు. నీతి నియమాల్ని తప్పకుండా భగవంతుడిపై మనసు పెట్టి ఆయన్నే ధ్యానించే వారూ ఉన్నారు. వారందరి దివ్యత్వం వల్లనే ప్రస్తుతం ఎన్ని కష్టాలు వస్తున్నావాటినుంచి మబ్బువీడిన చంద్రునిలా వెంటనే బయటపడ గలుగుతున్నాం.

ఈ పూజా విధానం ముగిసిన తరువాత ఆకాశంలో సప్తబుషుల్ని, అరుంధతిని చూస్తూ ఆయా బుషుల్ని పూజించాలి. అన్నట్టు ఈ పూజకు ముఖ్యంగా నాలుగువత్తుల దీపాన్ని ఉంచాలి. పూజ అయిన తరువాత గేదె పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూర తదితరాలను నైవేద్యం పెట్టి బంధుమిత్రులతో భోజనం ముగించాలి.

వివాహమైన వారు కనుక ఈ వ్రతం చేస్తే భర్తనుంచి మరింత ప్రేమను, సుఖాన్ని పొందుతారు. అదే వితంతువలు చేస్తే వచ్చే జన్మలో ఆయుష్మంతుడైన భర్తను పొందుతారని వ్రతోత్సవం తెలియచేస్తోంది. అన్నట్టు భర్త ఉండగా ఒక్కసారైన ఈ వ్రతం చేయని పక్షంలో భర్త పోయిన తరువాత కూడా చేసే అధికారం లేదని శాస్త్రం చెబుతోంది.

బుద్ధజయంతి

అన్నట్టు ఇదే రోజు బుద్ధజయంతికూడా. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అంటూ దివ్యమైన ప్రబోధాన్ని అందించిన మహానుభావుడైన బుద్ధభగవానుడు కూడా ఇదేరోజు జన్మించాడు. ఆయన్ను మహావిష్ణువు అవతారంగా కూడా మనం పూజించుకుంటాం.

మనిషైపుట్టినవాడు ధర్మ బద్ధంగా, పవిత్రమైన జీవితాన్ని గడపాలని సూచించేవే ఆయన బోధనలన్నీ. శాంతగుణంతో క్రోధాన్ని, రుజువర్తనంతో చెడు మార్గాన్ని, దానత్వంతో పిసిని గొట్టుతనాన్ని, ప్రేమతో ద్వేషాన్ని, సత్యంతో అసత్యాన్ని జయించడ మనేది అనాదిగా వస్తున్న ఆచా రమే. ప్రస్తుతం అది కొరవడింది కాబట్టే ఈనాడిన్ని అరాచకాలు చూస్తున్నాం. అలా కాకుండా అన్ని ప్రాణులపట్ల సానుభూతిని కలిగి ఉండ డమే నిజమైన ధర్మం. ముఖ్యంగా బుద్ధుడు మనకు పంచశీల సిద్ధాంతాన్ని బోధించాడు. ఆ బోధనలేమిటో ఒక్కసారి మననంచేసుకుని ఆయనకు ఘనంగా కృతజ్ఞ తలు చెప్పుకుందాం.

జీవహింస, దొంగతనం, వ్యభిచారం చెయ్యకుండా ఉండమని, అలాగే అసత్యం పలకరాదని, మత్తుపదార్థాలు సేవించకూడదని ఆయన చెప్పాడు. చెప్పినవన్నీ మంచివే అయినప్పుడూ, వాటిని ఆచరించడం వల్ల మనకు మేలు కలుగుతున్నప్పడు ఆచరించడంలో తప్పేముంది? చెప్పండి!

రచన : దుగ్గిరాల గోపాలకృష్ణ మూర్తి

  • ==============================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: