Monday, June 14, 2010

ప్రత్యంగిరా దేవి , Pratyangira Devi Goddess




ప్రత్యంగిరా నవోస్తుతే
లక్ష సింహ ముఖాలతో... భగభగమండే కేశాలతో... త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరా దేవి అని పురాణప్రతీతి. ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు అత్యంత అరుదు. అంతటి అరుదైన ప్రత్యంగిరా ఆలయం మన రాష్ట్ర రాజధానిలోనే ఉంది.

శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు వంటి మహనీయులెందరో పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి అని పురాణప్రతీతి. కానీ ఉగ్రస్వరూపిణి కావడంతో కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారే కరవయ్యారు. ఉత్తరాదిన హిమాలయాల్లోని మానససరోవరం సమీపంలో 'కృత్య'గానూ దక్షిణాదిన కుంభకోణం (తమిళనాడు)లోని అయ్యావరే అడవిలో నికుంభిలగానూ... ఇలా కొన్నిచోట్ల మాత్రమే పూజలందుకుంటోంది ఈ అమ్మవారు. ఈ విషయం తెలుసుకున్న ములుగు మల్లికార్జునరావు గత నలభయ్యేళ్లుగా ఎన్నో గ్రంథాలు పరిశీలించి ప్రత్యంగిరాదేవి గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు. మానససరోవరం, కుంభకోణంలో కొలువైన ఆ ఉగ్రస్వరూపిణిని దర్శించి పూజాదికాలు నిర్వహించారు. అమ్మవారిపై భక్తితో హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో (రామకృష్ణాపురం రోడ్‌ నెంబర్‌ 1, అష్టలక్ష్మీ ఆలయ సమీపంలో)ని కుర్తాళం పీఠంలో ప్రత్యంగిరాదేవిని ప్రతిష్ఠించారు. ఆ అమ్మతో పాటు ఆదిపరాశక్తి సాత్విక, రౌద్ర అంశలుగా భావించే కాళి, తార, చిన్నమస్తా, త్రిపుర భైరవి, భగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడశి(లలితాత్రిపురసుందరి), కమలాత్మిక (లక్ష్మీదేవి) అమ్మవార్లనూ ప్రతిష్ఠించారు.

శత్రుసంహారం, దారిద్య్రనివారణ, మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర. ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే మంచిదని చెబుతారు పెద్దలు. సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి. రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండుమిరపకాయలు, తెల్లఆవాలు, నల్లఉప్పు, శొంఠి, సమిదల వంటి రాజద్రవ్యాలతో అదీ అమావాస్యనాడు ప్రత్యేక అభిషేకాలూ హోమాలూ నిర్వహిస్తారు.

దుష్టశిక్షణార్థం...
సృష్టి ఆరంభంలో దేవతలకూ దానవులకూ యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుణ్ని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట. సుదర్శన చక్రం ఆ రాక్షసుణ్ని ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట. ఆ సంగతి తెల్సుకుని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట. ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయగర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంటపడ్డాడట. దాంతో వారిద్దరూ తమకిక ఆదిపరాశక్తే దిక్కని తలచి ఆ తల్లిని ప్రార్థించారట. అప్పుడు ఆదిపరాశక్తి లక్షసింహముఖాలతో అతిభయంకరంగా ఆవిర్భవించి రాక్షసుడినీ అతని సైన్యాన్నీ సంహరించిందట.
లోకభీకరంగా వెలసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారనీ అందుకే ప్రత్యంగిరా దేవికి పూజాదికాలు నిర్వహించే ఆచారం అంతగాలేదనీ ఐతిహ్యం.
అధర్వణవేదంలోని మంత్రాలలో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది కాబట్టి అధర్వణ భద్రకాళి అనీ శత్రువులకు వూపిరాడకుండా చేసే శక్తి కనుక నికుంభిల అనీ... ఇలా ప్రత్యంగిరా దేవికి చాలా పేర్లున్నాయి.
ఇంద్రజిత్తు ఆరాధన...
ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణకాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసంధుడు తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని 'నికుంభిల' రూపాన పూజించి ఉపాసన చేసేవాడనీ ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతుబలులు ఇచ్చి బయలుదేరేవాడనీ అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదనీ ప్రతీతి. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం వెుదలుపెట్టాడట. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతణ్ని జయించడం సులువని వానరసేనకు చెప్పాడట. దాంతో వానరులంతా వెళ్లి యాగమండపాన్నీ యజ్ఞాన్నీ ధ్వంసం చేశారట. సమయం మించిపోతుండటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు. ఆరోజే లక్ష్మణుడిని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట.

ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని 'చంద్రఘంట'(నవదుర్గలలో మూడో అవతారం) రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట. ఇలా ఎందరో పురాణపురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి. ప్రత్యక్షంగానే కాదు... పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచికాపాడుతుందని నమ్మిక. నిత్యం లలితాసహస్రనామం చదివేవారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం.

  • ================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: