Sunday, February 7, 2010

బ్రహ్మ , Brahma



సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకడు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమలసంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని కల్పం అంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తూ తుడిచిపెట్టుకుని పోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు ఆయుర్ధాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మ స్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు. హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతారు.

బ్రహ్మ మానస పుత్రులు పది మంది :
సనకుడు, సనాతనుడు, సనందనుడు మరియు సనత్కుమారుడు. వీరు జీవితపర్యంతం బ్రహ్మచర్యం పాటించి మహామహిమాత్ములైన ఋషులుగా పేరుపొందారు
మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు

బ్రహ్మ - విష్ణువుల సంవాదం

అసలు.. తననెవరు పుట్టించినదీ కూడా ఆ చతుర్ముఖునకు అర్థంకాని స్థితి. అసలు మూలం ఏమిటో శోధించాలని, ఆ పద్మం మొదలు తెలుసుకోవాలని తామరతూడు గూండా ప్రయాణించసాగాడు అతడు. నూరేళ్ళు గడిచినా మొదలు దరిదాపులకు చేరువ కాలేకపోయాడు.

బాగా విసిగి, వెనుదిరిగాడు. ఈలోగా - అనూహ్యంగా పెరిగిపోతూన్న తామరపుష్పం చతుర్ముఖునికి మరింత అందకుండా - అంతు తెలీకుండా పైకెదిగిపోయింది. మరో వందేళ్లు గడిచాయి. ఆది - అంతూ, అసలు - మూలం, పై శిఖరం ఏదీ తెలీక ఆ తామరతూడు మధ్యనే క్రిందు మీదులవుతూ మరో శతవత్సరాలు గతించాయి చతుర్ముఖునికి.

ఇలా ఎంతకాలం? అనే చింత అధికమై, చతుర్ముఖుడు కొట్టు మిట్టాడుతుండగా 'తపించు' అనే అశరీరవాణి హెచ్చరిక తోచింది. ఎంతో తపించిన మీదట, తపోవేగ ప్రయాణఫలాన నారాయణుడి చెంతకు చేరుకోగలిగాడు హిరణ్యగర్భుడు.

చతుర్భుజుడై, నీలదేహుడై, మిలమిల మెరిసే అభరణాల కాంతులతో ప్రకాశిస్తూ నిద్రిస్తున్న నారాయణుని లేపి ఎవర్నువ్వు అంటూ ప్రశ్నించాడు బ్రహ్మ. "కుమారా! నీకు ఇంతకాలం పట్టిందన్న మాట నన్ను చూడడానికి. పోనీ! ఇప్పటికైనా తెలుసుకున్నావు నాయనా!" అని అనునయంగా పలికాడు విష్ణువు.

చతుర్ముఖుడికి కోపం వచ్చింది. నీట్లోపడి నిద్దరోతూన్నది చాలక, ఇన్ని వందల ఏళ్ళు కేవలం పైకీ - క్రిందికీ ప్రయాణించిన తనను.. ఒక్క ప్రయాణంలోనే ఇంతకాలం గడిపిన తనను... ఇంత తేలిగ్గా తీసేస్తాడా? అని రోషం వచ్చింది.

"అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? స్వయంభువుని నేను. అందర్నీ పుట్టించగల శక్తి నాకుంది. అనాదిని. నిద్రమత్తు విడిచి కాస్తచూడు! నా దర్శనంతో పుణ్యాత్ముడివి కమ్ము! అని మహా అహంకార స్వరంతో పలికాడు చతుర్ముఖుడు.

నారాయణుడెంత నయమున భయమున చేప్తున్నప్పటికీ, అంత కంతకూ హిరణ్యగర్భుడి అహం పెచ్చు పెరుగుతోందే తప్ప తరగడం లేదు. మరీ ముఖ్యంగా ఈ నిద్రమొహం తనను చిన్నవాణ్ణి చేసి ఆడించెయ్యడం, చతుర్ముఖుడికి తలకొట్టేసినట్టుగా ఉంది. "అది కాదు కుమారా! ఈ జగత్ సృష్టి నిమిత్తం నిన్ను నాయొక్క నాభికమలం నుంచి ఆవిర్భవింపజేసిన దెవరనుకున్నావు? అది నేనే!" అన్నాడు విష్ణువు.

"చాలించు నీ గొప్పలు! ఎంత కోతలు కోస్తే మాత్రం నమ్మొద్దూ? నేను ముందే చెప్పాను - నీకంటె పెద్దననీ - స్వయంగా పుట్టాననీ!"

"అది నీ భ్రమ!" అన్నాడు విష్ణువు.

"భ్రమపడుతున్నది నీవే! ఎంతయినా, నిద్రమత్తు ప్రభావమే అంత!"

"ఇది మత్తుకాదు చతురాననా!"

'మత్తు కాకుంటే మాయ! కాకుంటే - నీ అజ్ఞానం'. పరిహసించాడు బ్రహ్మ.

"కాస్త తెలుసుకుని మాట్లాడు! శుద్ధ అజ్ఞానివి నీవే!"

"తెలుస్తూనే ఉంది అజ్ఞానమెవరిదో! పరబ్రహ్మాన్ని నేనే!" అహంకరించాడు బ్రహ్మ.

శివమాయా విలసనం అటువంటిది. ఇద్దరూ ఆ మహామాయ కెరఅయి వాగ్యుద్ధ శూరులైపోసాగారు.

సంవాదం ముదురి పాకానబడింది. లీలావినోదాన్ని చూస్తున్నాడు పరమశివుడు. శ్రీ సదాశివుని మహిమ పూర్తిగా తెలియగల సమర్థులెవరు? ఇటు చతురాననుడికీ అంత చతురతలేదు. అటు నారాయణుడికీ పారీణత లేదు. వాగ్యుద్ధం మరింత ముదరసాగింది.

అది అసాధారణ స్థితికి చేరుకున్నాక, ఇక దానికి అడ్డుకట్ట వేయదలచి, పరమశివుడు ఆది మధ్యాంత రహితమైన లింగరూపములతో అక్కడ ప్రత్యక్షమైయ్యాడు. ఆ మహాతేజోలింగ దర్శనంతో అంతవరకూ వారిద్దరికీ కప్పివున్న మాయ యవనిక తొలగింది. బ్రహ్మ విష్ణువు లిద్దరూ పశ్చాతాపం చెంది, శివతత్వ స్ఫురణతో శివుని శతథా స్తుతించారు.

More details -> Brahma

---------------------------------------------------------------------------------------------

సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలే లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు? ఈ సందేహాలకు సమాధానాలు రాజస్థాన్‌లోని పుష్కర్‌ పుణ్యక్షేత్రంలో లభిస్తాయి అంటున్నారు ఆ ప్రాంతాన్ని సందర్శించిన .............................విద్యా విజయవోహన్‌.
అజ్మీర్‌కి 11 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఓ సరస్సు పేరే పుష్కర్‌. క్రమంగా ఆ ప్రాంతం కూడా ఆ పేరుతోనే ప్రాచుర్యం పొందింది. ఈ సరస్సులో ఉన్న 52 ఘాట్‌లు పూజలూ హోమాలతో నిత్యం కోలాహలంగా ఉంటాయి. ఈ సరస్సు చెంతనే ఉంది బ్రహ్మ దేవాలయం. ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఒకే ఒక ఆలయం ఇది. అంతేకాదు, మనదేశంలోని అతిముఖ్యమైన తీర్థక్షేత్రాల్లో పుష్కర్‌ ఒకటి. దీన్ని దర్శించకపోతే తీర్థక్షేత్రాల పర్యటన పూర్తి కానట్లేనట. అందుకే దీన్ని తీర్థరాజ్‌ అనీ అంటారు. ఈ క్షేత్రం వెనక ఉన్న స్థలపురాణం కూడా ఎంతో ఆసక్తికరంగా అనిపించడంతో పుష్కర్‌నీ అక్కడున్న బ్రహ్మ దేవాలయాన్నీ తప్పనిసరిగా సందర్శించాలనుకుని బయలుదేరాం.


పద్మపురాణం ప్రకారం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడట సృష్టికర్త. ఆ సందర్భంగా పూవునుంచి రేకులు మూడుచోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయట. వాటినే జ్యేష్ట పుష్కర్‌, మధ్య పుష్కర్‌, కనిష్ట పుష్కర్‌ అని పిలుస్తున్నారు. పైగా బ్రహ్మ భూమ్మీదకి వచ్చి తన చేతి(కరం)లోని పుష్పం నుంచి రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్‌ అని పేరు పెట్టాడట. ఆ తరవాత లోకకల్యాణం కోసం అక్కడే యజ్ఞం చేయాలనీ సంకల్పించాడట. ఎలాంటి ఆటంకాలూ లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకి దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూరా, తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు. సుమూహుర్తం ఆసన్నమయింది. ఆహూతులంతా విచ్చేశారు. సావిత్రీదేవి(ఈమెనే సరస్వతి అని పిలుస్తారు)ని తీసుకుని రమ్మని కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ.

నారదుడు వెళ్లేసరికి ఆమె రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ కలహభోజనుడు వూరికే ఉంటాడా... 'నువ్వు ఒక్కదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావు. నీ స్నేహితులతో కలిసిరమ్మ'ని సలహా ఇస్తాడు. దాంతో తన సహచరులైన లక్ష్మీ, పార్వతిలతో కలిసి వద్దామని ఆగిపోతుంది సావిత్రి. యజ్ఞవాటిక దగ్గర మూహూర్తం మించిపోతోంది. సావిత్రీదేవి జాడ లేదు. దేవతలు, రుషులు అంతా సిద్ధంగా ఉన్నారు. అనుకున్న మూహూర్తానికే యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో 'వెంటనే ఓ అమ్మాయిని చూడు. వివాహం చేసుకుని యజ్ఞం నిర్వహిస్తాను' అనడంతో సమీపంలోని గుజ్జర్ల కుటుంబానికి చెందిన పాలమ్ముకునే ఓ అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు. శివుడు, శ్రీమహావిష్ణువు సలహాల ప్రకారం గోవులోకి పంపించడం ద్వారా ఆమెను శుద్ధి చేస్తారు. ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లేనని చెప్పి అభ్యంగన స్నానం
చేయించి సర్వాభరణశోభితురాలిని చేస్తారు. గోవుతో శుద్ధిచేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభిస్తారు. పూర్తవుతున్న సమయంలో అక్కడకు వచ్చిన సావిత్రీదేవి బ్రహ్మదేవుడికి పక్కన మరో స్త్రీ ఉండటం చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితోసహా అక్కడున్న వారందరినీ శపిస్తుంది. భర్తని వృద్ధుడై పొమ్మనీ ఆయనకు ఒక్క పుష్కర్‌లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపిస్తుంది. అన్ని యుద్ధాల్లోనూ ఓటమి తప్పదని ఇంద్రుడినీ, మానవజన్మ ఎత్తి భార్యావియోగంతో బాధపడతావని విష్ణుమూర్తినీ, శ్మశానంలో భూతప్రేతగణాలతో జీవించమని ఈశ్వరుణ్ణీ, దారిద్య్రంతో ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేసుకొమ్మని బ్రాహ్మణులనీ ధనమంతా దొంగలపాలయి నిరుపేదగా మారమని కుబేరుణ్ణీ శపిస్తుందట. తరవాత ఆమె రత్నగిరి పర్వతాల్లోకి వెళ్లి తపస్సమాధిలోకి వెళ్లిపోయిందనీ ఆపై నదిగా మారిందనీ చెబుతుంటారు.

దీన్ని సూచిస్తూ రత్నగిరి కొండమీద సావిత్రీమాత ఆలయంతోపాటు ఓ చిన్న నీటిప్రవాహం కూడా ఉంది. దీన్ని సావిత్రీనది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్యసుమంగళి వరాన్ని ప్రసాదిస్తుందన్న నమ్మకంతో పుష్కర్‌ను సందర్శించిన భక్తులంతా ఆమె ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు.

సావిత్రీదేవి వెళ్లిన తరవాత బ్రాహ్మణులను యజ్ఞం పూర్తిచేయమని కోరతాడు బ్రహ్మదేవుడు. అందుకు వారంతా తమకు శాపవిముక్తి చేయమనీ ఆ తరవాతే యజ్ఞక్రతువు చేస్తామనీ అంటారట. అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో గాయత్రీదేవి పుష్కర్‌ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందనీ ఇంద్రుడు మళ్లీ స్వర్గాన్ని గెలుచుకుంటాడనీ విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడనీ బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ శాపతీవ్రతని తగ్గిస్తుందట. బ్రహ్మదేవాలయం పుష్కర్‌లో మాత్రమే ఉండటానికి ఇదే కారణమట. అయితే బ్రహ్మదేవాలయాలు అత్యంత అరుదుగానయినా అక్కడక్కడా లేకపోలేదు. కానీ అవేమీ పుష్కర్‌లో మాదిరిగా ఉండవు. ఎందుకంటే ఈ ఆలయస్థలాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఎంపిక చేసుకోగా యాగానంతరం విశ్వామిత్రుడు కట్టించాడన్నది పౌరాణిక కథనం.అంతేకాదు... ప్రపంచంలోకెల్లా ముఖ్యమైన వెుదటి పది పుణ్యక్షేత్రాల్లో పుష్కర్‌ ఒకటనీ భారత్‌లో హిందువులు దర్శించే వెుదటి ఐదింటిలో ఇదీ ఒకటని ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ టైమ్స్‌ గుర్తించడం విశేషం. పౌరాణికంగా ఎంతో ప్రాశస్త్యం చెందిన పంచసరోవరాల్లో పుష్కర్‌ కూడా ఒకటి.
మహాభారత, రామాయణాల్లోనూ ఆదితీర్థంగా దీని ప్రస్తావన ఉంది. కార్తీక పౌర్ణమిరోజున ఇందులో ఓసారి మునిగితే వందల సంవత్సరాలపాటు యజ్ఞం చేసిన ఫలం దక్కుతుందట.గాయత్రీసమేతంగా...ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ దేవాలయం నిర్మాణపరంగా 14వ శతాబ్దంనాటిది. కానీ దీనికి ముందే అక్కడ ఉన్న పురాతన ఆలయం సుమారు 2 వేల
సంవత్సరాలనాటిదట. తరవాత ఆదిశంకరాచార్య ఓసారీ, మధ్యయుగంలో మహారాజా జవత్‌రాజ మరోసారీ పునరుద్ధరించారట. ఆలయంలోపల గోడలకు వందలకొద్దీ వెండి నాణేలు అంటించి ఉన్నాయి. భక్తులు తమ పేర్లు చెక్కిన నాణేలను ఇక్కడ బ్రహ్మదేవుడికి కానుకలుగా సమర్పిస్తుంటారు. పాలరాతి మెట్లు ఎక్కి మంటపం దాటి గర్భగుడిలోకి వెళ్లగానే హంసవాహనం మీద ఉన్న చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం కనిపిస్తుంది. ఆయన నాలుగు చేతుల్లో వరసగా అక్షమాల, కమండలం, పుస్తకం, దర్భలు ఉంటాయి. ఎడమ వైపు గాయత్రీదేవి ఉంటుంది. ఆలయ గోడలమీద సరస్వతీదేవితోపాటు ఇతర దేవీ దేవతల బొమ్మలు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఈ స్థలపురాణంలోని విశిష్టతను చాటిచెబుతుంటాయి.చలికాలంలో ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి 8.30 వరకూ వేసవిలో రాత్రి 9 గంటల వరకూ తెరచి ఉంటుంది. మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 గంటలవరకూ విరామం. ఆలయంలో పూజావిధానాలు సనాతనధర్మం ప్రకారమే జరుగుతుంటాయి. గర్భగుడిలోని విగ్రహాన్ని పెళ్లయిన పురుషులు పూజించకూడదు. కేవలం సన్యసించినవాళ్లే పూజలు నిర్వహించాలి. ఆ సాధువులు కూడా పుష్కర్‌లోని పరాశర గోత్రీకులు మాత్రమే అయి ఉండాలన్నది నిబంధన. అందుకే భక్తులు తమ కానుకలను అక్కడున్న పూజారి సాధువు ద్వారానే దేవుడికి నివేదిస్తారు. గర్భగృహానికి ఎదురుగా ఉన్న మంటపంలో వెండి తాబేలు ఉంటుంది. ఏటా కార్తీక పౌర్ణమికి బ్రహ్మదేవుడికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారట. ఆ సమయంలో వేలమంది భక్తులు సరస్సులో సాన్నం చేసి బ్రహ్మను దర్శించుకుంటారు. కార్తీక పౌర్ణమితోపాటు ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లోనూ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
కార్తీకంలోనే పుష్కర్‌ జాతర కూడా. ఇది దీపావళి తరవాత వచ్చే ఏకాదశినాడు వెుదలై పౌర్ణమివరకూ జరుగుతుంది. ఈ సమయంలో ఒంటెల సంత కూడా ఉంటుంది. జాతరకోసం రాజస్థాన్‌లోని అన్ని ప్రాంతాలవాసులూ తరలివస్తారు. తోలుబొమ్మలాటలకూ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు, హస్తకళాకృతులకూ పుష్కర్‌ జాతర పెట్టిందిపేరు.
బ్రహ్మ ఆలయాన్ని చూసిన తరవాత ఇక్కడున్న సావిత్రీ, గాయత్రీ ఆలయాలను కూడా దర్శించుకున్నాం. పురాణంలో చెప్పినట్లుగానే ఆ ఇద్దరు దేవతలవీ ఇక్కడున్న సరస్సుకు ఎదురెదురుగా ఉన్న రెండు వేర్వేరు కొండలమీద ఉన్నాయి. అందునా బ్రహ్మమీద కోపంతో మండిపడ్డ సావిత్రీదేవి ఆలయం పుష్కర్‌లోకెల్లా ఎత్తయిన రత్నగిరి కొండమీద బ్రహ్మదేవుడి ఆలయానికి వెనకవైపున ఉంది. అందులోని విగ్రహం కూడా కోపంగా ఉంటుంది. అదేసమయంలో ఆమె కోపానికి భయపడుతున్నట్లుగా గాయత్రీదేవి దర్శనమిస్తుంది. ఈమె ఆలయం సరస్సుకు తూర్పుభాగాన ఉన్న చిన్న
కొండమీద ఉంటుంది.


పుష్కర్‌లో ఇంకా సుమారు 400 పురాతన ఆలయాలు ఉన్నాయట. వీటిల్లో ప్రధానమైనది అప్తేశ్వర్‌ ఆలయం. ఇది బ్రహ్మదేవుడి ఆలయానికి పక్కనే ఉన్న గుహలో ఉంటుంది. దీనికో పురాణగాథ చెబుతారు. బ్రహ్మదేవుడు సంకల్పించిన యజ్ఞస్థలికి చేతిలో పుర్రెతో ఓ బిక్షువు రాగా ఆయన్ని అక్కడ నుంచి వెళ్లిపొమ్మంటాడట బ్రహ్మ. అందుకా భిక్షువు కోపగించుకుని పుర్రెను అక్కడే వదిలి మాయమవుతాడట. దాన్ని తీసి పక్కన పారేసేలోగా ఆ ప్రదేశమంతా పుర్రెలే ప్రత్యక్షమవుతుంటాయట. దాంతో యజ్ఞానికి విచ్చేసినది స్వయంగా మహాదేవుడేనని దివ్యదృష్టితో తెలసుకున్న బ్రహ్మ, అక్కడో లింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని అప్తేశ్వర్‌గా పూజిస్తాడట. ఈ లింగాన్ని పూజించి అభిషేకం చేసినవారికి మోక్షం కలుగుతుందని చెప్పి మహదేవుడిని శాంతింపజేశాడని చెబుతారు. ఇక్కడ లింగం పెద్దదిగా ఉండి దానికి రాగితో చేసిన పాము చుట్టుకున్నట్లుగా ఉంటుంది. శివరాత్రిరోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తరవాత రంగ్‌జీ ఆలయానికి వెళ్లాం. దక్షిణాది శైలిలో కట్టిన ఈ ఆలయంలో విష్ణుమూర్తిని రంగ్‌జీగా పూజిస్తారు. తప్పక చూడదగ్గ మరో ఆలయం వరాహదేవాలయం. ఇక్కడ విష్ణువు వరాహరూపంలో దర్శనమిస్తాడు. విష్ణుమూర్తి స్వయంగా భూలోకానికి వచ్చి వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ని వధించిన నేపథ్యంలో కట్టినదిగా చెబుతారు. చారిత్రకంగా దీన్ని అనాజీ చౌహాన్‌ కట్టించాడట. వీటితోపాటు అక్కడున్న అనేక ప్రాచినదేవాలయాలను చూసి ఉత్కృష్టమైన పుష్కర్‌ యాత్రను ముగించుకుని ఇంటికి చేరుకున్నాం.

-- సేకరణ : డా.శేషగిరిరావు -శ్రీకాకుళం .
  • =========================================================

Visit My Website - > Dr.Seshagirirao

No comments: