Sunday, October 4, 2009

రాఖీ పండుగ , Rakhi panduga




'రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.

శ్రావణమాస వైశిష్ట్యం ఎంతో గొప్పది. ఎందరికో ఆనందాన్నిచ్చేది. మంగళగౌరి, శ్రీ మహావరలక్ష్మీ వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు యిలా ఎంతో కోలాహలంగా వుంటుంది శ్రావణమాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం వుంది. ఈ పున్నమిని భారతదేశ వివిధ ప్రాంతాల ప్రజలు రకరకాలుగా జరుపుకుంటారు.

శ్రావణంలో అధికంగా వానలు కురుస్తూ, ప్రకృతి కొత్త అందాలతో, పచ్చని పైరు పంటలతో ఆహ్లాదకరంగా వుంటుంది. రైతన్నలపాలిట వరం ఈ శ్రావణ వున్నమి. పంటలు బాగా పండాలని, సిరులు నిండాలని పుడమి తల్లికి పూజచేసి నార్లు నాటే సమయం ఇది. దీన్నే కజరి పూర్ణిమ అంటారు.

చేపలు పట్టేవారికి, వ్యాపారం చేసుకునేవారికి అనువైన కాలం. సముద్ర తీరప్రజలు ఇంద్రుణ్ణి, వరుణుడిని పూజిస్తారు. ఈ సమయంలో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లేరోజులు. తమని కాపాడమని, అధికంగా జలపుష్పాలు లభించాలనికోరుతూ ఆ దేవతలని పూజిస్తారు. ఈ పౌర్ణమినే కొన్ని ప్రాంతాల్లో "నారియల్పౌర్ణమి" అంటారు. నారియల్ అంటే కొబ్బరికాయ. కొబ్బరికాయలని సముద్రంలో విసిరివేయడం ద్వారా తమ భక్తిని చాటుకుంటారు. ఇలా చేయడానికి రామాయణంలోని కథ ప్రచారంలో వుంది. శ్రీరాముడు లంకలో వున్న సీతని రావణాసురుని చెర నుంచి విడిపించడానికి వానరసేన సహాయం కోరినపుడు, వానరులు బండరాళ్లని సముద్రంలోకి విసిరి "సేతుబంధనం" నిర్మిస్తారు. రాముడు ఆ వారథిమీదుగా లంకని చేరుకుని సీతను రక్షించాడు అని రామాయణ కథ చెప్తూ కొబ్బరికాయని సముద్రంలోకి విసిరివేస్తూ వుంటారు. అంతేకాదు కొబ్బరికాయని మూడు కన్నులుగల శివునిగా భావిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో తీరవాసులు పాటిస్తారు.

"శ్రావణపౌర్ణమి"నే జంథ్యాల పౌర్ణమిగా బ్రాహ్మణులు పండుగ చేసుకుంటారు. కొన్ని చోట్ల రుషి తర్పణం అని కూడా పిలుస్తారు. ఆ రోజున గాయత్రీ మంత్రం జపిస్తూ, వేదమంత్రాల మధ్య పాత యజ్ఞోపవీతం తీసివేసి కొత్తది ధరిస్తారు. ఈ జంథ్యాల పౌర్ణమి భారతీయ సంస్కృతికి చిహ్నం. యజ్ఞోపవీతధారణ అనంతరం కొబ్బరితో చేసిన స్వీట్లు అందరికీ పంచుతారు. "జంథ్యం" వేసుకునే ప్రతి వ్యక్తి దీన్ని పాటిస్తాడు.

రాఖీ పున్నమిగా పేరొందిన ఈ పౌర్ణమినాడు భారతీయులంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకుంటారు. ఇంటి ఆడపడుచులు తన సోదరుల నుంచి ఆత్మీయానురాగాలను, అనుబంధాలను, రక్షను కోరుతూ రాఖీ కడతారు.

రాకీలతోపాటు పూజాథాలీ( పూజ పళ్ళాలు) అలంకరణ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఏదో బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలా:తేనత్వం అనుబంధామి రక్షమాంచమాంచలం:

అంటూ బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.

రాఖీ వెనుక ఎంత చరిత్రో!
రంగురంగుల రాఖీల్ని... అన్నదమ్ములకి కట్టి... ఆనందం పంచుకున్నారుగా! మరి ఆ రాఖీ విశేషాల్ని,రాఖీ వెనుక ఎంత చరిత్రో! తెలుసుకోండి!

చెల్లెళ్లు అన్నయ్యలకు, అక్కలు తమ్ముళ్లకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు కదా! మన రాష్ట్రంలో రాఖీ పౌర్ణమి పేరుతో ఈ పండుగను ఇలానే చేసు కుంటాం. మరి మిగతా రాష్ట్రాల్లో రాఖీ పండుగను ఏమని పిలుస్తారో? ఎలా జరుపుకుంటారో? తెలుసుకోవద్దూ.
* ఒరిస్సాలో రాఖీ పండుగను 'గ్రహ్మ పూర్ణిమ' అని పిలుస్తారు. ఆ రోజున వారు దైవాల్లా భావించే ఆవులు, ఎద్దులికి శుభ్రంగా స్నానం చేయించి, అలంకరణలు చేస్తారు. 'పితా' అని పిలిచే మిఠాయిలు చేసి ఇరుగుపొరుగు వాళ్లకి పంచుతారు.
* మహారాష్ట్ర, గుజరాత్‌, గోవాలలో ఈ రోజును 'నారియల్‌ పూర్ణిమ' అంటారు. బాగా వర్షాలు పడాలని వరుణదేవుణ్ని, సముద్రుణ్ని పూజిస్తారు. జాలరులు ఈ రోజు నుంచే చేపలు పట్టే కాలం ప్రారంభమైనట్టు భావిస్తారు.
* ఉత్తరాఖండ్‌లోని ప్రజలు 'జనోపున్యు' పేరుతో రాఖీ పండుగను చేసుకుంటారు. తమ పవిత్రమైన జంధ్యాన్ని మారుస్తారు. చంపావత్‌ అనే జిల్లాలో బగ్వాల్‌ పేరుతో పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
* మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, బీహార్‌లలో 'కజరి పూర్ణిమ' అని పిలుస్తారు. ఇది రైతులకి, కొడుకులున్న తల్లులకి చాలా ముఖ్యమైన పండగ.
* గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో 'పవిత్రోపన' పేరుతో పండుగను నిర్వహిస్తారు. ఈ రోజున శివుని గురించి ప్రజలందరూ పూజ చేస్తారు.
రాఖీ పుట్టుక వెనుక బోలెడు పురాణ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు రాఖీని అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు కట్టుకుంటున్నారు కానీ మొదట ఈ రాఖీని ఓ భార్య భర్తకి కట్టిందని, ఓ దేవత రాక్షస రాజుకి కట్టిందని, ఓ రాణి తన శత్రురాజుకు పంపిందని తెలుసా? వాళ్లంతా మన పురాణ పాత్రలే.
  • వృత్తాసురుడనే రాక్షసునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అతనికి విజయం కలగాలని కోరుతూ ఇంద్రుని భార్య ఇంద్రాణి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతని కుడిచేతి మణికట్టుకి కట్టింది. అలా రాఖీ పుట్టిందని చెపుతారు.
  • ఓసారి రాక్షస రాజైన బలి చక్రవర్తి భూమిని ఆక్రమిస్తాడు. దానవుల నుంచి మనుషులను కాపాడటానికి విష్ణుమూర్తి వైకుంఠాన్ని, లక్ష్మీదేవిని వదిలి భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణపౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో చెపుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మనుషులకు విముక్తి కలిగిస్తాడు. విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.
  • మన భారతదేశాన్ని ఆక్రమించడానికి వచ్చిన అలెగ్జాండర్‌ తెలుసుగా! అతణ్ని కూడా ఓసారి రాఖీ కాపాడింది. సుమారు క్రీస్తు పూర్వం 326లో గ్రీస్‌ రాజైన అలెగ్జాండర్‌ తన సేనలతో మన దేశం మీదకి దండెత్తి వచ్చాడు. ఇక్కడే రోక్సానా అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఓసారి పురుషోత్తముడు అనే భారతరాజుతో యుద్ధానికి సిద్ధమయ్యాడు అలెగ్జాండర్‌. పురుషోత్తముని పరాక్రమం గురించి ముందే తెలుసుకున్న రోక్సానా ఆ చక్రవర్తికి ఓ రాఖీని పంపి, తన భర్తను ఏం చేయద్దని కోరింది. యుద్ధంలో అలెగ్జాండర్‌ మీదకి కత్తి ఎత్తిన పురుషోత్తముడు తన చేతి మణికట్టుకి ఉన్న రాఖీని చూసి అలెగ్జాండర్‌ని చంపకుండా వదిలివేశాడు.
  • ఓసారి శ్రీకృష్ణులవారి చేతికి గాయమైతే ద్రౌపది తన చీరను చించి , ఆ చేతి నుంచి రక్తము కారకుండా కట్టు కట్టినది . ఆమెకు తనమీదగల ఆ సోదర ప్రేమకు శ్రీకృష్ణుడు కష్టకాలములో ఆదుకుంటానని ఆమె రక్షణగా ఉంటానని మాట ఇచ్చాడు . శ్రీకృష్ణుడు దాన్ని రక్షాబంధనము గా భావించాడు .
  • ఈ రాఖీ కట్టే ఆచారము మొగలాయి రాజుల కాలములో స్త్రీల రక్షణకోసము రాజపుత్రులు చేసిన ఏర్పాటని కొందరు అంటారు . చిత్తూరు మహారాణి కర్ణావతి తనకోటను గుజరాత్ నవాబైన బహదూర్ షా ముట్టడించినపుడు తనని రక్షించమని ఢిల్లి చక్రవర్తి హుమయూన్‌ పాదుషా కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్ధించిందట . ఆమెను తన సోదరిగా భావించి బహదూర్ షా ను తరిమివేసాడు .
ఇలా ఎన్నో కధలు గాధలు ఈ రాఖీ పండుగ గుంరించి చెప్పుకుంటారు . ఇది ఒక నమ్మకము తోనూ , ప్రేమతోనూ , అనుబంధముతోనూ కూడుకున్న ఆచారము .

  • Collected by Dr.Seshagirirao-MBBS (Srikakulam)

No comments: