Tuesday, January 4, 2011

నర్రవాడ వెంగమాంబ , Narrawada VengamAmba

వెంగమాంబ అనే పేరుతో ఎంతమంది స్త్రీమూర్తులు ఉన్నారో తెలియదు గానీ నాకు తెలిసిన వెంగమాంబలు ... తరికొండ వెంగమాంబ , రెడ్డిగుంట వెంగమాంబ , నర్రవాడ వెంగమాంబ ఉన్నారు .

నర్రవాడ వెంగమాంబ : గ్రామదేవత .
ఆంధ్రప్రదేశ్ లోని వందలాది మంది గ్రామదేవతల కదల్ని పరిశీలిస్తే వారివారి పాతివ్రత్య మహిమచేతనో , దైవభక్తి చేతనో దుర్మాగ్రాన్ని ఎదిరించి తమ దైవత్వాన్ని నిరూపించి దేవతలైనట్లు తెలుస్తోంది . అయితే నర్రవాడ వెంగమాంబ తన సహజ శక్తిని సమాజ శ్రేయస్సుకు , సంస్కరణకు , నైతిక విలువల పునరుద్ధరణకు , అస్పృశ్యతా నివారణకు వినిరోగించి ఇహపరశక్తులను ఆశ్చర్యపరచినది . సత్వగుణాత్మికయై స్త్రీ జాతిని చైతన్య పరచినది . సహజంగా కొత్త కోడలు ఎదుర్కొనే అత్త ఆడపడుచు ల ఆరళ్ళను దైర్యము గా ఎదుర్కోంటూ , మరో వైపు తన ఐదోతనాన్ని సైతం లెక్కచేయక భర్తను దుష్టశిక్షణకోసం నడిపించి ఎందరో అభాగ్య స్త్రీల మానప్రాణాలను కాపాడైన మహిమాన్విత , మానవత్వము నుండే దైవత్వము ఆవిర్భవిస్తుందని నిరూపించిన దేవత .

నర్రవాడ వెంగమాంబ కొలువైన చోటు :
నాడు విక్రమ సింహపురియను పేర ప్రసిద్ధి పొందిన నేటి నెల్లూరుకు హృదయస్థానము ఉదయగిరి . సుమారు వెయ్యేళ్ళు చరిత్ర కలిగిన ఈ హృదయగిరి మనసును రంజింపజేసే ప్రకృతి శోభకు ఆలవాలమైనది ... ఎత్తైన కొండలు దట్టమైన అడవులు . కొండఅంచులనుండి జాలువారే జలపాతాలు భాహ్యప్రపంచాన్ని మరపింపజేస్తుంది . శత్రు దుర్భేద్యమయిన ఉదయగిరి దుర్గాన్ని కళింగరాజైన లాంగూల గజపతి నిర్మించాడు . దీని ఎత్తు సముద్ర మట్టానికి 3079 అడుగులు .. ఘనచరిత్ర కలిగిన ఈ పట్టణమందు , చుట్టుప్రక్కల ప్రాంతాలలో సుమారు 365 దేవాలయాలుండేవి . వీటిని 1610 సం. ప్రాంతం లో శత్రురాజులు కూల్చివేసారని అక్కడివారు చెపుతారు . పార్వతి పరమేశ్వరులకు దేవగంధర్వులకు ఈ ప్రాంతం విహార స్థలమని పురాణాలు తెలియజేస్తున్నాయి . పవిత్ర స్థలము కావడం వల్ల యోగులు , మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసుకునేవారు . దట్టమైన అడవులు , కొండలు , వుండడం చేత గజదొంగలకు స్థానము గా ఉండేది . దైవభక్తి , దివ్యశక్తి కి నెలవైన ఉదయగిరి ప్రాంతం లో పచ్చని గడ్డి కి కొదువలేదు ... ఎక్కువగా ఉండేది . అందువల్ల పశుసంపద ఇక్కడి ప్రజలకు ఎక్కువ సాదాయాన్ని తెచ్చి పెట్టేది . పదమూడవ శతాబ్దిలో యాదవవంశ యశోధీక్షితుడైన శ్రీ కాటమరాజు తన పశువుల్ని ఇక్కడ మేపుకొని పుల్లరివల్ల ఏర్పడిన తగాదాకారణము గా ఆ సమయం లో నెల్లూరును పాలించే నల్లసిద్ది రాజుతో యుద్ధం చేసి అతనిని హతమార్చి జీవకారుణ్యతను లోకానికి చాటిచెప్పడు . ఈ వీరుని వీరోచిత పోరాటాన్ని ఇప్పటికీ జానపదులు కథలుగా చెప్పుకొంటూ పశుగ్రాసం మీద పుల్లరి విధించి ప్రజల్ని హింసించే ప్రభువులకు కనువిప్పు కలిగిస్తూ వుంటారు . ఇలాంటి చారిత్రక , ఆధ్యాత్మిక నేపధ్యము కలిగిన ఉదయగిరిగి ఈశాన్యదిశలో సుమారు ఇరవై కిలోమీటర్ల దూరములో వున్న నర్రవాడ గ్రామం లో శ్రీవెంగమాంబ దేవత కొలువై ఉన్నది .

స్థల పురాణము :

  • -- courtesy : picasa.google.com/
దుస్ట శిక్షణ , శిస్ట రక్షణ కోసం భగవంతుడు మనిషి రూపం లో జన్మిస్తాడని భగవద్గీత తెలియజేస్తోంది . ఇందులో భాగం గానే తనకు మారుగా సర్వేశ్వరుడు స్త్రీని సృస్టించాడనేది వాదన . జగన్మాత అనేక రూపాల్లో అవతరించి దుష్టులను హతమార్చి లోకకళ్యాణం జరిపించిదని దేవీభావతం సాక్ష్యమిస్తుంది . జగన్మాత ఆవిర్భావానికి మూలకారణాలు సామాజిక అరాచకం , ద్ర్ష్టశక్తులు విలయతాండవం చేయడం గా పేర్కొనవచ్చు . నర్రవాడ ప్రాంతం లో గజదొంగల అకృత్యాలకు అంతులేకుండా వుండేది . స్త్రీల మానప్రాణాలకు రక్షణ వుండేది కాదు . పశువుల మేపుకు , వాటి అమ్మకాలకు పురుషులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు . ఈ పరిస్థితులలో స్త్రీలు , బలహీనులైన వృద్ధులు గజదొంగల నీచకృత్యాలకు తలవంచక తప్పలేదు . మూఢనమ్మకాలతో , అర్ధం లేని సామాజిక కట్టుబాట్లతో మానవతా విలువలు అడూంటిపోయిన దశలో తమను ఆదుకోడానికి చేవతామూర్తి జన్మించాలంటూ కనీటితో ఆకాశానికేసి ప్రార్ధించేవారు . ఆదిపరాశక్తి అయిన ఎల్లమ్మతల్లి వారి మొర ఆలకించి తానే శ్రీ వెంగమాంబగా జన్మించిందని ఇక్కడి స్థలపురాణము తెలియజేస్తుంది .

నర్రవాడ వెంగమాంబ జననము :

ఇది క్రీ.శ. 16 వ శతాబ్ధిలో జరిగిన వాస్తవకథ . నర్రవాడ గ్రామానికి సమీపానగల వడ్డిపాలెం లో పచ్చన వెంగమ నాయుడు , సాయమ్మ అనే దంపతులు వుండేవారు . వీరు ఎల్లమ్మ భక్తులు . బిడ్డలకోసము పుణ్యక్షేత్రాలు తిరిగారు , వ్రతాలు , దానధర్మాలు చేశారు . వీరి నోముల పంటగా ఎల్లమ్మ తల్లి వెంగమ్మ తల్లిగా జన్మించినది . జగన్మాత పుట్టుకకు ప్రకృతి , యోగీశ్వరులు పరవశించిపోయారు . అనిర్వచనీయమైన ఆనందము ఆ దంపతులలోను , నర్రవాడ గ్రామములోను తాండవించింది . దివ్యశకులలతో జన్మించిన ఆమె పుట్టుకతోనే ప్రణవాన్ని , గాయత్రి మంత్రాన్ని పలికింది. ఆత్మజ్ఞానం తోదినదిన ప్రవర్ధమానమవుతూ తననెచ్చెలి తుమ్మల పెదవెంగమ్మకు ఆధ్యాత్మిక సూత్రాలను , ఆర్యసూక్తులను చెపుతూ వాటిని ఆచరణలో చూపించేది . ఆమె బోధనలు విని ఆగ్రామ ప్రజలు భక్తి ప్రపత్తులతో నైతిక జీవనాన్ని సాగిస్తూ క్రమేణా చైతన్యవంతులయ్యారు . యుక్తవయస్సుకు వచ్చిన వెంగమాంబను అదే ఊరిలోని వేమూరి అంకయ్యనాయుడు రెండవ కుమారుడు గురవయ్యకిచ్చి వివాహము జరిపించారు . సాహసవంతుడు , సౌశీల్యవంతుడు అయిన గురవయ్య సాహచర్యం లో వివాహ జీవన వైశిష్ట్యాన్ని త్రికరణ శుద్దితో ఆచరించినది వెంగమాంబ . తనకోసము కాదు ఈ బ్రతుకు ... అమాజముకోసము అన్నట్లు ఏవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్కచేయక ధైర్యముతో ముందుకు నడచి సమాజ శ్రేయస్సుకోసం పాటుపడింది .

సామాజిక కట్టుబాట్లను ఎదిరించి మానవతా విలువల్ని పరిరక్షించింది . త్రాగునీటి ఎద్దడితో అలమటిస్తున్న దళిత వర్గాలకు బాసటగా నిలబడి మంచినీరు అందించింది . ప్రజలంతా సమానులని , అంటరానితనము జాతిమనుగడకు సామాజిక శపమని భోదించింది .ప్రకృతి వైపరీత్యాలవల్ల క్షామము ఏర్పడి తాగడానికి గుక్కెడు నీళ్ళుకూడా దొరకని పరిస్థితిలో తన పూజలతో వర్షం కురిపించి నిమ్నవర్గాలను ఆదుకొంది . తన ఐదవతనాన్ని సైతం లెక్కచేయక తన భర్తను ఆయుధంగా గజదొంగల మీదకు పంపించి సాటి మానవతుల మాన ప్రాణాలను కాపాడింది . గజదొంగలతో వీరోచితంగా పోరాడి వారిని హతమార్చిన గురవయ్య ఒక గజదొంగ రహస్యముగా వెనకనుండి వేసిన బళ్ళెం పోటుతో నేలకొరిగాడు . లోకపాననియైన ఆ తల్లి భర్తకు మరణం తప్పదని గ్రహించి సుమంగళి గా తనువుచాలించి పేరంటాలుగా వెలసి ప్రజల్ని రక్షించాలని నిర్ణయించుకొంది . దళితులు స్వయం గా తయారుచేసి ఇచ్చిన నేతచీరను కట్టుకొని భర్తకంటే ముందుగా దహనం కావడనికి ఊరిపెద్దల అనుమతి పొంది కొన్ని నిముషాలలో మరణించే భర్త చుట్టూ ప్రదక్షిణచేసి యోగాగ్నిలో దూకి అనంత శక్తిలో ఐక్యమైపోయింది .

తల్లిని కోల్పోయిన బిడ్డలవలే కన్నిరు మున్నీరుగా రోదిస్తున్న ప్రజలకు అంతర్వాణి ద్వారా " నేను ఇక్కడే దేవతగా ఆవిర్భవిస్తాను . అందుకు గుర్తుగా నా మంగళ సూత్రాలు , పమిటచెంగు , మెట్టెలు , పసుపు కుంకుమలు చెక్కుచెదరకుండా వుంటాయని " చెప్పింది . ఆ తల్లి చెప్పినవిధంగా ఆ వస్తువులన్నీచూసిన ప్రజలు భక్తి పారవశ్యం తో " శ్రీ వెంగమాంబ పేరంటాలకు జై " అంటూ జయజయధ్వానాలు చేసి గుడికట్టించి నేటికీ లవేల్పుగా కులదైవముగా పూజిస్తున్నారు . ఈ దేవతకు 1940 సంవత్సరములో ఆలయం నిర్మించారు . అమ్మవారు భర్త గురవయ్యతో కొలువైన మందిరానికి ఎడమవైపు తన స్నేహితురాలైన పెదవెంగమ్మ దంపతుల విగ్రహాలను ప్రతిష్టించారు . కుడివైపు అందుడైన వెంగమాంబ బావ ముసలయ్య విగ్రహం పూజలందుకొంటుంది .

ప్రతిసంవత్సరము జ్యేష్టమాసం లో పౌర్ణము వెళ్ళేక వచ్చే మొదటి ఆదివారము నుండి గురువారము వరకూ గల ఐదురోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు . ఆదివారము " నిలుపు " , సోమ మంగళ వారములలో "గ్రామోత్సవం " , బుధవారము " పసుపు కుంకుమ ఉత్సవం " , గురువారము " పొంగళ్ళు - బండ్లు తిరుగుట , ఎడ్లచే బండ్లు లాగుట పోటీలు , వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి . ఈ తిరునాళ్ళకు వేలాది భక్తులు వస్తూఉంటారు . టన్నుకకొద్ది ఎండుకొబ్బరి అగ్నిగుండలో వేయడం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది . ఈ ఐదురోజులు ఆ ప్రాంతం ప్రజలు మాంస భక్షణ చేయరు . ఈ ఆలయము నర్రవాడ గ్ర్రామము నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం లో ఉన్నది .

మూలము : డా. పిన్ని చక్రపాణి గారి వ్యాసము .


===============================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: