Wednesday, October 20, 2010

Navadurgalu , నవదుర్గలు










హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కధనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

గొవా, మహారాష్ట్రలలో అధికంగా ఉన్న గౌడ సారసజ్వత బ్రాహ్మణుల కులదేవత "నవదుర్గ". గొవాలో మడికియమ్, పాలె, పోయింగ్వినిమ్, బోరిమ్‌లలోను, మహారాష్ట్రలోని రేడి, వెంగుర్ల లలోను నవదుర్గా మందిరాలున్నాయి. 16వ శతాబ్దిలో గోవా రేడి నవదురగ్ మందిరం ప్రస్తుత మహారాష్ట్రలోని వెంగుర్లకు మార్చబడింది. నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజిస్తారు.

నవదుర్గలు -మహిమలు

శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటేతి, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.


1.శైలపుత్రి:
' వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్
వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్'

కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.
హిమవంతుడు తపస్సు చేసి , ఆమెను కుమార్తెగా కోరగా అతనికి జన్మించినది .

2.బ్రహ్మచారిణి:
'దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా
దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా '

ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది.
శివుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య . ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఎకాగ్రత కలుగుతుంది .


3.చంద్రఘంట:
'పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా
ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా'

దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.

4.కూష్మాండ రూపం:
'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '

జ్ఞానరూపిణి,సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
సంసారమనే జగత్తు యొక్క అందాన్ని ఉదరాన ధరించే మాయారూపిణి .. ఈమె .

5.స్కందమాత:
'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '

ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ . శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.


6.కాత్యాయిని:
'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '

దేవతల కార్యార్దము కతుడు అనే మునిపుంగవుని ఆశ్రమం లో ఒక జన్మలో పుట్టి అక్కడే పెరగడం వల్ల ... ఈనామము . కాత్యాయనీ మాత వింధ్యాచలవాసిని. ఈమె సాక్షాత్తూ గాయత్రీ అవతారమేనని చెప్పబడింది. కాత్యాయనీ ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి. వేదవిద్య అబ్బుతుంది .

7.కాళరాత్రి :
'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '

మృత్యువు కే భయకారిణి , ప్రళయకాలములో యముణ్ణి కూడా నశింపజేయగలదీ అయిన మూలశక్తి ... ఈమె . కాళరాత్రీ దేవి కాలవర్ణంతో , త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె వాహనం గార్ధబం. ఈమె ఉపాసన వల్ల సర్వ విపత్తులు తొలగిపోయి సర్వసౌభాగ్యాలు లభిస్తాయి. ఈమెకు గల మరో నామం శుభంకరి.

8.మహాగౌరి:
'శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబరధరా శుచిః
మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'

పుట్టుకతోనే నల్లని రంగుగల పరమేశ్వరిని ... పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా " కాళీ " అని పిలు్స్తాడు . దాంతో ఆమె శివుమితో పంతగించి , బ్రహ్మ గుఎఇంచి కఠోర తపస్సు చేసి ... ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్ల్ని ఛాయతో 'మహా గౌరి 'గా అవతరించినది . అష్టమశక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.

9.సిద్ధిధాత్రి:
'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ

తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.


  • ఈ వ్యాసము వికిపెడియా నుండి సేకరించబడి కొత్త సమాచారముతో తిరిగి రాయడం జరిగినది .

For full details >see in telugu wikipedia - Navadurga
  • ======================================
Visit My Website - > Dr.Seshagirirao.com

No comments: