Sunday, August 22, 2010

దీపలక్ష్మీ పూజ , Deepa lakshi pooja,లక్ష్మీపూజ



భక్తితో , ఏకాగ్రతతో ప్రతిదినమూ శక్టి కొలదీ శ్రీ మహాలక్ష్మిని పూజించినవారికి ... ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణము గా లభిస్తుంది . నియమ నిస్టలతో 9 శుక్రవారారాలు అర్చిస్తే మనోభీష్టాలన్నీ నెరవేరతాయి . ఆశ్వయుజమాసము లో వచ్చే దీపావళి పండుగరోజున ఆభరణాలకీ , ధనానికీ పూజ చేయడం . . . లక్ష్మీపూజలో ఓ భాగము . ఇంటిని గోమయం తో శుబ్రము చేసి (పూరము ఇల్లు శుబ్రము చేయడానికి ఆవు పేడ, ఆవు మూత్రము తప్ప ఏమీ దొరికేవికావు .. ప్రస్తుతం ఫ్లోర్ క్లీనర్స్ ఎన్నో దొరుకుతున్నాయి ) కల్లాపిజల్లి , ముగ్గులు పెట్టి దీపాలును వెలిగించడమే లక్ష్మీపూజలో ముఖ్యమైనది .
వెలుగునిచ్చే దీపం ఒక్కటి ఉన్నా ఆ వెలుగు రేఖల్లో ప్రయాణం చేయడం సులభమవుతుంది. దీపాన్ని లక్ష్మితో పోల్చడం కూడా మన సంప్రదాయంలో ఉంది. దీపలక్ష్మి పూజ దీపావళి సందర్భంగా సర్వత్రా జరుపుకోవడం ఏనాటి నుంచో ఓ ఆచారంగా ఉంది. ఈ ఆచారం వెనుక కొన్ని విశ్వాసాలు, మరికొన్ని సమాజ చైతన్య విషయాలు కూడా ఉన్నాయి. దీప పూజలో ఆశ్వయుజ బహుళ త్రయోదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పూజ దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క నమ్మకంతో చేస్తుంటారు.

దీపావళి పండుగ అనగానే సాధారణంగా నరక చతుర్దశి, దీపావళి అమావాస్య అనే రెండు రోజులు మాత్రమే ఎక్కువగా తెలుగునాట పండుగగా జరుపుకోవడం కనిపిస్తుంది. అయితే ఈ దీపాల సంబరం దీపావళికి రెండు రోజుల ముందు నుంచే అంటే త్రయోదశి నుంచే ప్రారంభమవుతుంది. ఈ త్రయోదశి వ్రతాన్ని గురించి వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. త్రయోదశి నాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం నూనెతో దీపాన్ని వెలిగించి దాన్ని పూజించి ఇంటికి ఎదురుగా వెలుపలి భాగంలో ఉంచుతారు. దీనికి యమ దీపం అనిపేరు. ఇది యముడి అనుగ్రహాన్ని పొందడం కోసం పెడుతుంటారు. యమ లోకంలోని పితరులు తమ వారి గృహాలకు ఆ రోజున తిరిగి వస్తారని, అందుకే అలా యమ దీపం పెడతారని కొందరంటారు. ధన త్రయోదశి నాడు సాయంకాలం అలా దీపాన్ని ఓ పద్ధతి ప్రకారం పెడతారు. ఇంటిముందు దక్షిణ దిక్కుగా ఈ దీపాన్ని ఉంచుతారు. వచ్చే పితరులకు అది దారి చూపిస్తుందని నమ్మకం. ఇంటిలో ప్రతి గదిలోనూ ఈ రోజున ఒక దీపాన్ని ఉంచుతారు. ఈ దీపాలు పెట్టే బాధ్యత స్త్రీలదే. కొన్ని ప్రాంతాల్లో ఇలా దీపం పెట్టడం తల్లిదండ్రులు లేని ఇంటి యజమాని మాత్రమే చేయడం ఉంది. తల్లిదండ్రులు జీవించి ఉన్నవారు యమ దీపాన్ని పెట్టక పోవడం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇది ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాల నేపథ్యంలో జరుగుతుంది కనుక ఆయా ప్రాంతాల వారు వారి పెద్దల సూచనల మేరకు ఈ యమ దీపాన్ని పెట్టాలో అక్కర్లేదో నిర్ణయించుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ఇలా ధన త్రయోదశి అనడం కనిపిస్తుంది. ధన త్రయోదశిని 'ధన్‌తేరాస్‌' అని అంటారు. ఈ రోజున లక్ష్మీపూజ అంతా చేస్తారు. ఇళ్లను శుభ్రం చేయడం, అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడం చేస్తుంటారు. ఇంట్లో ఉన్న బంగారు, వెండి వస్తువులను పాలతో కడిగి శుభ్రం చేసి లక్ష్మీదేవి పూజలో ఉంచుతారు. ఇలా చేస్తే ధన కనకాలు అభివృద్ధి చెందుతాయన్నది నమ్మకం. ఆశ్వయుజ బహుళ త్రయోదశి తర్వాత వచ్చే చతుర్దశి నాడు కూడా లక్ష్మీపూజ చేస్తుంటారు. చతుర్దశి నాటి రాత్రి మూడోజాము తర్వాత నరక భయ నివారణ కోసం తలంటు పోసుకుంటారు. ఇలా చేయడం లక్ష్మీ దేవికి ప్రీతికరమని, అది సకల ఐశ్వర్య దాయకమని నమ్మకం. చతుర్దశి నాటి నూనెలో లక్ష్మి, నీటిలో గంగ ఉంటారు. కనుక ఆనాటి తలంటు స్నానానికి అంతటి ప్రత్యేకత ఉంది. తలంటు సమయంలో ఉత్తరేణు, సొర, తగిరిస లాంటి ఆకులను తలమీద తిప్పుకొని అవతల పారేస్తారు. ఇలా చేస్తే ఆ మనిషిలో ఉన్న చెడు, దరిద్రం అవతలకు పోతాయన్నది నమ్మకం. ఇలా తలంటు స్నానం అయ్యాక నరకుడిని ఉద్దేశించి యమ తర్పణం ఇవ్వడం పితృదేవతా పూజనంలో ఒక భాగం. అలాగే నాలుగు ఒత్తులతో ఉన్న దీపాన్ని కూడా దానం చేస్తారు. ఈ రోజున భోజనంలో మినపాకులతో కూర ఉండాలని పెద్దలు చెపుతారు. ఇదంతా నరక చతుర్దశి నాటి ఉదయ కాలపు పూజా వ్యవహారం. ఇక అదే రోజున సాయంకాలం నాడు దేవాలయంలోను, మఠంలోను దీపాలను వెలిగించాలి.

నరక చతుర్దశి నాడు ఇలా దీప దానం చేయడం, దీపాలను వెలిగించడం, మినపాకుతో వండిన కూరను తినాలనడంలో ఓ సామాజిక పరమైన బాధ్యత, ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. కేవలం ఎవరి ఇళ్ల ముందు వారు దీపాలు పెట్టి సంబరపడిపోక మఠాల వంటి వాటి దగ్గర కూడా దీపాలను ఉంచాలని హితబోధ చేస్తున్నట్లుగా ఇక్కడ అంతరార్ధం కనిపిస్తుంది. దీపావళి పండగ రోజులంటే అందరికీ సరదాయే. ఆ సరదా సమయాల్లో తమ పితరులను కూడా స్మరించుకునేందుకే యమ దీపం పెట్టడం ఆచారమైందంటారు.
-- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు


  • =======================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: