Monday, August 30, 2010

బౌద్ధ మతము , Boudda Religion , Buddhism



మతము-నిర్వచనము: మరణానంతరం సకల చరాచర జగత్తు కు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలు గా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గము లో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానమే మతము .
బౌద్దమతం -->
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి

  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh-8FwKPYF3ZzPks7FGC1IlY6rV9ggtvXDIxIvuXBd_1hyphenhyphenk3fhGP9NF5smR2ket8p6-UIwPKrr73ZEDS2jRg7jc6_EtS9hymWSmQ5dQRniCLSQBEQb_PGTboyew43mDmza35FAkYeggOWTN/s1600/Buttha-2.jpg

ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఇందుకు భిన్నమైనది బౌద్దమతం. బౌద్దమతాన్ని అనుసరించే వారిని బిక్షువులు అంటారు. వీరు ఎక్కువగా టిబెట్‌, నేపాల్‌, చైనా, భూటాన్‌, బర్మాలలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మతాన్ని అనుసరిస్తున్న వారు 50 కోట్ల మందికి పైగా ఉన్నారు. వీరందరికి ముఖ్యమైన పర్వదినం వైశాఖ పూర్ణిమ. అంటే బుద్ధ జయంతి. బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. వైశాఖ పూర్ణిమనాడు పుట్టారు. వైశాఖ పూర్ణిమ నాడే బుద్ధుడిగా మారాడు. వైశాఖ పూర్ణిమనాడే నిర్యాణం చెందాడు. ఇలా వైశాఖ పూర్ణిమ బుద్దిని జీవితంతో పెనవేసుకొని ఉంది.

2,500 సంవత్సరాలకు పూర్వం నేడు నేపాల్‌గా పిలుస్తున్న హిమాలయ పర్వత సానువులకు దగ్గర శాక్యులనే తెగవారు నివసించేవారు. వారి రాజధాని కపిలవస్తు నగరం. కపిలవస్తు రాణి మాయాదేవి గర్భం ధరించింది. ఆమెకు పుట్టింటికి పోవాలన్న కోరిక కలిగి ఆ విషయాన్ని రాజుకు వెల్లడించింది. రాజు పల్లకి బోయిలను రప్పించి రాణి పుట్టింటికి వెళ్లడానికి సన్నాహాలు చేశాడు. ఆమె పుట్టిల్లు తోడిశాక్య ప్రజాసత్తాక రాజ్యమైన దేవదహనగరం.

కపిలవస్తు నుండి దేవదహకు పోయేదారిలోనే లుంబిని వనం ఉంది. ఇది అడవిమార్గంలో ఉంటుంది. అక్కడ సాలవృక్షాలు ప్రసిద్ధి చెందినవి. పల్లకి ఆ మార్గంలోకి వచ్చేసరికి రాణికి నొప్పులు వచ్చాయి. పల్లకీ ఆపమని చెప్పింది. ఆమెకు తోడుగా ఆమె సోదరి ఉంది. పురుషులెవరో వస్తోన్నారని గ్రహించిన సోదరి రాణికి పురుడుపోయడానికి వీలుగా ప్రదేశాన్ని చదునుచేసి ఆకులు పరచమని బోయిలను సూచించింది. అక్కడే మగ శిశువును ప్రసవించింది. అతనే గౌతముడు.

పెరిగి పెద్దవాడవ్ఞతున్నకొద్దీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్న కొద్దీ గౌతమునికి తీవ్రమైన మసస్తాపం కలిగింది. దీంతో భార్యను, బిడ్డలను వదిలి దుఃఖాన్ని తొలగించుకోడానికి పరితపిస్తూ ఉన్న గౌతముడు వైశాఖ పూర్ణిమ రోజున బీహార్‌లోని గయ చెంతగల మర్రివృక్షం కిందకు చేరాడు. వెంటనే దివ్యకాంతి ఆవహించి మనస్సు స్థిరమైపోయింది. ఆరోజు నుంచి గౌతముడు గౌతమ బుద్దునిగా మారాడు. తనకు కలిగిన ఈ పరివర్తనను గ్రహించిన బుద్దుడు తనకు కలిగిన అనుభవాలను బోధిస్తూ ఊరూరా తిరుగుతూ బౌద్దమత ప్రచారాన్ని ప్రారంభించాడు. మానవుడు మానవుడిగా ఉండాలంటే ఏం చేయాలో పంచశీల సూత్రాల ద్వారా ప్రబోధించాడు.

అవి 1. ప్రాణం తీయకు 2. దొంగతనం చేయకు 3. అబద్దాలాడకు 4. కామంతో ఆచరించకు 5. మద్యం సేవించకు. వీటిని ఏమతం కాదనలేదు. ఇవి మతానికి అతీతమైన సత్యాలు. పంచశీలాలతో పాటు బ్రహ్మ విహారాలు నాలుగింటిని కూడా బోధించాడు. అవి
ఎ. మైత్రి : గుండెను కదిలించేది. ఎట్టి పరిస్థితుల్లోనూ అందరి సుఖసంతోషాలను నిజంగా కోరుకోవడం
బి. కరుణ : ఇతరుల కష్టాలతో కదిలిపోయే మనస్తత్వం. ఇతరుల బాధను తమ బాధగా భావించి సహాయపడటం
సి. ముదితా : మానవునిలో అంతర్గతంగా దాగివున్న శత్రువు ఈర్ష్య. ఇతరుల ఉన్నతిని చూసి అసూయపడకుండా వారిని అభినందించగలగడం.
డి. ఉపేక్ష : అందరి పట్ల సమన్యాయం కలిగి ఉండటం. రాగద్వేషాలకు అతీతంగా ఉండటం.

ఇలా బోధనలు చేస్తూ ఉండగా బుద్దునికి అనేక శిష్యులు తయారయ్యారు. వారిలో ఆనందుడు ఒకడు.
బుద్దుడు పెద్దవాడయ్యాడు. ముసలితనం దగ్గరపడుతున్నకొద్దీ తన చరమకాలాన్ని ఒక పల్లెపట్టున గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆనందుడు బుద్దునితో కలిసి సాలవృక్షాలతో నిండిన అరణ్యంలోకి వెళ్లాడు. రెండు సాలవృక్షాల మధ్య కొమ్మలతో ఒక చిన్న మంచం తయారుచేశాడు ఆనందుడు. అక్కడే బుద్దుడు నిర్యాణం చెందాడు. ఆరోజు వైశాఖ శుద్ద పౌర్ణిమ కావడం యాధృచ్చికం. ఆ ప్రదేశం కుసినర, తరువాతి కాలంలో కుసినగరంగా ప్రసిద్ధి పొందింది.

బుద్దుని జీవితంలో పెనవేసుకున్న వైశాఖ పూర్ణిమ బౌద్దులకు మహాపర్వదినంగా మారింది. వైశాఖ పూర్ణిమనాడు బోధివృక్షానికి పూజచేసే ఆచారం బౌద్దులలో ప్రారంభమైంది. ఇది కూడా బుద్దుడి కాలంలోనే ప్రారంభం కావడం విశేషం. స్వామి వనంలో ఉండగా ఒకనాడు భక్తులు స్వామికి పూజచేయడం కోసం పూలు తెచ్చారు. ఎంతసేపు నిరీక్షించినా స్వామి కనిపించలేదు. భక్తులు నిరుత్సాహపడి అక్కడే ఆ పూలను వదిలేసి వెళ్లారు. దీన్ని గమనించిన అనంత పిండుడు అనే భక్తుడు స్వామి రావడంతోనే ఈవిషయాన్ని వెల్లడించాడు. స్వామి తన శరీరానికి పూజను నిరాకరించి తనకు జ్ఞానోపదేశం చేసిన బోధివృక్షాన్నే పూజించాలని చెప్పారు. తాను నిర్యాణం చెందాక కూడా తన పార్థివ శరీరానికి కాకుండా వృక్షానికే పూజలు చేయాలని శాసించారు.

స్వామి ఆంతర్యాన్ని గ్రహించిన ఆనందుడు గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి జేతవన విహారంలో నాటాడు. ఆనాడు ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహించారు. కోసలదేశపు రాజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులలో ముఖ్యభాగమైంది. ఈ పూజను ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు చేయడం ఆచారమైంది. బౌద్దమతం ఆచరిస్తున్న అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధివృక్షానికి పూజలు చేస్తారు. ఆనాడు బౌద్దులు బోధివృక్షానికి జెండాలు కట్టి దీపాలు పెట్టి పరిమళ జలాన్ని చల్లుతారు.

హీనయాన బౌద్దమతాన్ని అనుసరించే బర్మాలో ఈ ఉత్సవం చూడటానికి చాలా బాగుంటుంది. ప్రతి స్త్రీ పరిమళ జలభాండారాన్ని తలపై పెట్టుకొని మేళతాళాలతో బయలుదేరుతారు. వెనకనుంచి పిల్లలు, పెద్దలు దీపాలు, జెండాలు పట్టుకొని వస్తారు. బస్తీ నాలుగు మూలలనుంచి బయలుదేరిన వారంతా సాయంకాలానికి బౌద్దాల యానికి చేరుతారు. లోపల దేవాలయంలోని బోధివృక్షానికి మూడుసార్లు ప్రదక్షణ చేసి కుండల్లో తెచ్చిన నీటిని చెట్టు మొదట్లో పోసి దీపాలను వెలిగిస్తారు. చెట్టుకి జెండాలు కట్టి నమస్కరిస్తారు. ఇక్కడితో పూజ ముగిస్తుంది.

  • ===========================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: